Telangana Plantation Program: ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభోత్సవం రోజు తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. ముఖ్యమంత్రి మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించి.. మొక్కలు నాటిస్తారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతుకుతాయి.. ఎన్ని వృక్షాలుగా ఎదుగుతాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం బృహతరమైనది.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొక్కలు నాటి కార్యక్రమానికి హరితహారం అని పేరు పెట్టేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2023 వరకు హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కదంబం మొక్కను ఎక్కువగా నాటేవారు. పైగా ఆయన జాతకరీత్యా ఆ మొక్క నాటడం శ్రేయస్కరమని పండితులు చెబితే.. ఆయన అలానే చేసేవారు. కెసిఆర్ జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అది ఆయన ఇష్టం. కానీ కొంతమంది దానిని విమర్శించేవారు. కొన్ని సందర్భాలలో తన అలవాట్లను విమర్శించే వారికి కెసిఆర్ గట్టిగా సమాధానం చెప్పేవారు.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన వన మహోత్సవం అని పేరు పెట్టారు. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుర్రం గూడ అర్బన్ ఎకో పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఒక మొక్కను నాటారు. ఆయన వెంట అటవీ శాఖ మంత్రి సురేఖ. ఇతర అధికారులు ఉన్నారు.
గుర్రం గూడ ఎకో పార్కులో రేవంత్ రెడ్డి నాటిన మొక్క పేరు నాగలింగం.. దీని పువ్వులు అత్యంత పవిత్రమైనవి. దీని పండ్లు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. కౌరౌపిటా గుయా నెన్ సిస్ అనేది దీని శాస్త్రీయ నామం. ఈ మొక్క పువ్వులు శివలింగం ఆకారంలో ఉంటాయి. పువ్వు మధ్యలో శివుడి లింగం మాదిరిగా ఒక ఆకారం ఉంటుంది. దానిమీద పాము పడగపినట్టుగా పువ్వు రేకులు ఉంటాయి. అందువల్ల దీనిని నాగలింగ పుష్పం అని పిలుస్తుంటారు. ఈ పూలను శంకరుడికి అలంకరిస్తుంటారు. ఆయనకు ఈ పువ్వులు ఎంతో ప్రీతి పాత్ర మైనవి.
ఈ చెట్టు పువ్వులు పూచే విధానం విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా పువ్వులు కొమ్మలకు పూస్తుంటాయి. కానీ ఈ చెట్టుకు ప్రధాన కాండం నుంచి పువ్వులు పూస్తుంటాయి. ఈ పువ్వులు చూసేందుకు అత్యంత అందంగా ఉంటాయి. సువాసన కూడా అద్భుతంగా వెదజల్లుతూ ఉంటాయి. రాత్రిపూట మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఈ చెట్టు పండ్లు కూడా ఫిరంగుల మాదిరిగా ఉంటాయి వీటిని ఫిరంగి గుండ్లు అని పిలుస్తుంటారు. సైంటిఫిక్ భాషలో దీనిని కానన్ బాల్ ట్రీ అని పిలుస్తుంటారు.
సాంప్రదాయ ఔషధాలలో ఈ మొక్క పువ్వులు.. ఆకులు.. పండ్లను వాడుతుంటారు. నొప్పి నివారణకు.. ఫంగస్ నివారణకు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దీని పండ్లను ఉపయోగిస్తుంటారు. చర్మానికి సంబంధించిన వ్యాధులు నివారణలో.. కడుపు నొప్పి.. జలుబు.. ఇతర రోగాలను నయం చేయడానికి దీనిని వాడుతారు. ఈ మొక్కను కుండీలలో పెంచుకోవచ్చు. అయితే శాశ్వతంగా పెంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది విపరీతమైన ఎత్తు పెరుగుతుంది. ఖాళీ ప్రదేశాలలో.. పండ్ల తోటలలో ఈ మొక్కను పెంచుకోవచ్చు.
