CM Revanth Reddy: అదేంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలలో గండర గండడు కదా.. అంతటి కేసీఆర్ ను ఓడించి ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నాడు కదా.. కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ నిలబడ్డాడు కదా.. ముఖ్యమంత్రిగా రెండున్నర సంవత్సరాలు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కదా.. అటువంటి వ్యక్తికి ఒక ఎంపీ ని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి.. ఎంపీ మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తం అవుతున్నాయి కదా.. కరెక్టే.. కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కొన్ని సందర్భాలలో వద్దు అనుకున్న వాళ్ళతోనే అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ అవసరం రేవంత్ రెడ్డికి పడింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ను పూర్తిగా వదిలేసింది. ప్రతిపక్ష పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో విఫలమౌతుంది. చివరికి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు.. ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతోంది. కొన్ని పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ.. ఆ పత్రికలలో ఆస్థాయిలో ప్రచారం లభించడం లేదు. దీనికి తోడు ప్రభుత్వ పథకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. వారి వ్యక్తిగత ప్రచారానికి మాత్రమే వారు పరిమితం అవుతున్నారు.
గులాబీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ సోషల్ మీడియాను హైజాక్ చేస్తోంది. లెక్కకు మించిన చానల్స్ తో ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద.. ప్రభుత్వం మీద టన్నులకు టన్నులు మట్టిపొస్తోంది. దీంతో అధికార పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే రోజుల్లో ఇబ్బంది ఎదురవుతుందని రేవంత్ రెడ్డి భావించారు.
ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నేరుగా క్లాసు పీకారు. మీరు ఇలానే వ్యవహరిస్తే బాగోదని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేల ప్రవర్తన పెద్దగా మారలేదు. ఈ నేపథ్యంలో లాభం లేదనుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ పరంగా.. ప్రభుత్వం పరంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ప్రచార బాధ్యతలను ఒక ఎంపీకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ ఎంపీ రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటారు. గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన సపోర్ట్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నమ్మే అతికొద్ది మంది వ్యక్తులలో ఈ ఎంపీ కూడా ఉంటారు. అందువల్లే ఆ ఎంపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. చేసిన అభివృద్ధి.. ఇతర విషయాల మీద ప్రచారాన్ని గట్టిగా చేయాలని ఆ ఎంపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్యచరణ మొదలు పెడతారని.. గులాబీ పార్టీకి ధీటుగా బదులిస్తారని.. తెలుస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా బలం గుర్తించారు. ఇప్పటికైనా సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటే పార్టీకి బాగుంటుంది. ప్రభుత్వానికి అంతకంటే బాగుంటుంది. లేకుంటే అంతే సంగతులు.
