Professor Nageshwar Controversy: ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ వివరాలను లీక్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇది పెద్ద ఎత్తున దుమారానికి దారితీసింది. కూటమి పార్టీల మధ్య వైరుధ్యం ఉందన్న కోణంలో ప్రచారం నడిచింది. దీనిపై జనసేన సీరియస్ అయింది. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదయింది. మరోవైపు టిడిపి కూటమిపై జరుగుతున్న కుట్రగా భావించి కఠిన నిర్ణయాలు తీసుకు అడుగులు వేయాలని నిర్ణయించింది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ బహిరంగంగానే స్పందించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన చేశారు.
* అమిత్ షా తో భేటీ లీక్
కొద్ది రోజుల కిందట కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కోరారని.. అందుకు అమిత్ షా నిరాకరించారని.. చంద్రబాబు ఇనిస్టాంట్ ఫ్రెండ్.. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారని.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళొద్దని సూచించారని.. అమిత్ షా పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. జనసేన కోర్ కమిటీలో ఇదే విషయాన్ని నాదెండ్ల మనోహర్ తో పవన్ కళ్యాణ్ చెప్పించారని.. జనసేన వర్గాల నుంచి తనకు సమాచారం అందినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టారు టీవీ డిబేట్లో. అప్పటినుంచి రచ్చ రచ్చ నడుస్తోంది. ఇదిగో మాకు కేంద్రం మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగ హడావిడి చేసింది.
* ఆ భయంతోనే వెనక్కి..
అయితే ఈ ఎపిసోడ్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం అని.. అటువంటి వ్యక్తి ఇలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. అంతటితో ఆగకుండా జనసేన తరఫున ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఫిర్యాదు అందింది పోలీసులకు. ఇంకోవైపు కూటమి విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రగా టిడిపి పొలిట్ బ్యూరోలో నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలోనే అడ్డగోలుగా మద్దతు తెలిపారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అన్ని వర్గాలు వ్యతిరేకించగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని సమర్థించారు. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు సంబంధిత ఛానల్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మొత్తం పరిణామంతో కేసులు నమోదు తో పాటు అరెస్టులు ఉంటాయని భావించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అన్నింటికీ మించి తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని భావించి ఎటువంటి ఆధారాలు లేవని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ నాగేశ్వర్..
