KTR, Revanth Reddy
KTR : ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు.. అబద్ధప పునాదులపై కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది’ ఇదీ రెండు నెలల క్రితం రేవంత్ సర్కార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్న మాటలు ఇవీ.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే వంద రోజుల పాలన పూర్తిచేసుకుంది. ఇంతలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో ఇన్నాళ్లూ కూలుస్తామన్న నేతలకే సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ గేట్లు తెరిచామని.. ప్రకటించారు. అవతల ఖాళీ అయ్యాక టచ్ చేసేవారు ఉండరని ప్రకటించారు. ఆ వెంటనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా కడియం శ్రీహరిసైతం కాంగ్రెస్లో చేరారు. మరోవైపు సీనియర్నాయకులు కూడా బీఆర్ఎస్కు గుడ్బై చెబుతున్నారు.
మారిన కేటీఆర్ స్వరం..
బీఆర్ఎస్ నుంచి నేతలు వరుసగా కాంగ్రెస్లోకి వెళ్తుండడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఆందోళన చెందున్నారు. పార్టీని వీడే వారిని ఎలా ఆపాలి, క్యాడర్లో ఎలా ఆత్మస్థైర్యం నింపాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలో మొన్నటి వరకు కంగ్రెస్ సర్కార్ను కూలుస్తాం, కూతులుందని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్లోనే ఏక్నాథ్ షిండేలు..
కాంగ్రెస్లోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలే కాంగ్రెస్ సర్కార్ను కూలుస్తారని జోష్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు.