KCR: ద్రవిడ పార్టీ బాటలో గులాబీ దండు… వ్యూహం మార్చిన కేసీఆర్‌.. వర్కవుట్‌ అయితే పెను మార్పులు!

రాజకీయాల్లో విలక్షణమైన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. వ్యూహాలు రచించడంతో.. ఎత్తుగడలు వేయడంలో ఆయనకు ఆయనే దిట్ట. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు.. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టి పదేళ్ల పాలన వరకు ఆయన వ్యూహాలు పనిచేశాయి.

Written By: Raj Shekar, Updated On : August 15, 2024 4:16 pm

KCR

Follow us on

KCR: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. చూడడానికి బక్క పల్చని మనిషి. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి.. శాంతియుద నిరసనలు, సంప్రదింపులు, లాబీయింగ్‌ ద్వారా స్వరాష్ట్రం సాధించి బక్కోన్ని కాదు బలవంతుడిని అని నిరూపించారు. ఇక స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనే అయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు పార్టీని గెలిపించి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించారు. కొత్త రాష్ట్రమే అయినా తెలంగాణను అన్ని రంగాల్లో పెద్ద రాస్ట్రాలకు దీటుగా అభివద్ధి చేశారు. తాగు, సాగునీటి సమస్య పరిష్కరించారు. కొరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఇందతా ఒక్క రాత్రే జరగలేదు. దీని వెనుక కేసీఆర్‌ కషి, పట్టుదల, వ్యూహరచన, ప్రణాళిక ఉన్నాయి. కేసీఆర్‌ వ్యూహాలు ఎవరికీ అంత సులువుగా అర్థం కావు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన, రెండుసార్లు అధికారంలోకి రావడం వెనుక ఆయన వ్యూహాలే కారణం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యూహాలు ఫలించలేదు. అహంకారపూరిత మాటలు, కుటుంబ పాలన, ఉద్యోగాల భర్తీలో వివక్ష, తాను ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణి బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమయ్యాయి. ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. ఇప్పుడు రాజకీయ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. తననే ఎవరైనా ఫాలో కావాలని అనుకునే ఆయన.. ఇప్పుడ ద్రవిడ పార్టీని ఫాలో అవుతున్నారు.

డీఎంకే బాటలో..
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్‌ అధ్యయనం చేస్తున్నారు. డీఎంకే పార్టీకి, భారత రాష్ట్ర సమితికి కొన్ని పోలికలు ఉన్నాయి. రెండు పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడ్డవి. రెండు పార్టీల్లోనూ విపరీత ప్రాంతీయ వాదం.. తత్వం ఉంటుంది. రెండూ కూడా జాతీయ పార్టీలను వ్యతిరేకించే పార్టీలు.. ఒక వ్యక్తి సెంట్రిక్‌గా నిర్మాణమైన పార్టీలు. ఇందుకోసమే కేసీఆర్, డీఎంకే పార్టీ స్ట్రక్చర్‌పై అధ్యయనం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కన్నా ముందే డీఎంకేకి తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నాయి. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు. అన్నా డీఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డీఎంకే నుంచి చేరికలు లేవు.. కానీ ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై దష్టి పెట్టారు కెసీఆర్‌. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్‌ నేతత్వంలో ఒక బృందాన్ని చెన్నైకి పంపించారు. డీఎంకే ఎమ్మెల్యే శంకర్‌ ఈ బృందానికి పార్టీకి సంబంధించిన వివరాలను సవివరంగా వెల్లడించారు.

పార్టీకే ప్రాధాన్యం..
డీఎంకేలో ప్రభుత్వం కన్నా పార్టీకే నేతలు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎవరైనా ఎమ్మెల్యేని మంత్రి పదవి కావాలా..? జిల్లా అధ్యక్ష పదవి కావాలా..? అంటే జిల్లా అధ్యక్ష పదవి వైపే మొగ్గుచూపుతారు.. అక్కడ పార్టీకి అంతగా ప్రాధాన్యం ఇస్తారు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు, కమిటీల మధ్య సమన్వయం చాలా బలంగా ఉంటుంది. పార్టీ కార్యాలయాలు ప్రతీరోజు ఏదో కార్యక్రమంతో యాక్టివ్‌ గా ఉంటాయి. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు ప్రతీరోజు అందుబాటులో ఉంటారు. పథకాల రూపకల్పన, అమలులోనూ పార్టీ సూచనలే కీలకంగా ఉంటాయి.

బీఆర్‌ఎస్‌లో అమలు చేసేలా..
చెన్నై వెళ్లిన బీఆర్‌ఎస్‌ బృందం డీఎంకే పార్టీ విధానాలు, అనుసరిస్తున్న తీరు, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పార్టీకి నేతలు ఇచ్చే ప్రాధాన్యం తదితర అంశాలు తెలుసుకుంటున్నారు. వాటిని భారత రాష్ట్ర సమితిలోనూ ఇంప్లిమెంట్‌ చేయాలని గులాబీ బాస్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్‌ఎస్‌ బృందం హైదరాబాద్‌ చేరుకున్న వెంటనే కేసీఆర్‌కు నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ముఖ్య నేతల టీం మరోసారి చెన్నై వెళ్తుంది. వచ్చేనెల చివరికి పార్టీలో మార్పులు చేర్పుల విషయంలో డీఎంకేను ఫాలో కావాలన్నది కేసీఆర్‌ ఆలోచన అని పేర్కొంటున్నారు..