Jamili Elections : జమిలి’ తొలి దెబ్బ బీఆర్‌ఎస్‌కే.. బీజేపీ ఎలా చెక్ పెట్టబోతోందంటే?

తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ 2014 ఎన్నికలకన్నా ఎక్కువ సీట్లు సాధించారు. ఇక 2023లో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 11:29 pm
Follow us on

Jamili Elections : తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఐదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి 2020లో పార్టీ పగ్గాలను బండి సంజయ్‌కు అప్పగించింది. మాటలతో మాయ చేసే కేసీఆర్‌కు చెక్‌ పెట్టేది బండి సంజయ్‌ మాత్రమే అని అధిష్టానం భావించి.. అధ్యక్షుడిగా నియమించింది. తనకు అప్పగించిన బాధ్యతను నూటిని నూరు శాతం నెరవేర్చారు బండి సంజయ్‌. హైదరాబాద్‌లో మాత్రమే కనిపించే బీజేపీని పల్లె పల్లెకూ తీసుకెళ్లారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో.. పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మైలేజీ తెచ్చారు. పార్టీకి వచ్చిన ఊపుతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కనీసం రెండో స్థానంలో అయినా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటి వరకు ఉత్సాహం ఉరకలెత్తిన పార్టీలో నైరాష్యం నెలకొంది. క్యాడర్‌ డీలా పడింది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కేవలం 8 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమైంది.

బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా..
మూడేళ్లు బండి సంజయ్‌ కష్టపడి పార్టీని తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేశారు. ఒక దశలో బీజేపీ ఎక్కడుంది అన్న కేసీఆర్‌.. బీజీపీ పేరు ఎత్తకుండా ఉండలేని పరిస్థితి తెచ్చారు. ఇక కేంద్రంలో కేసీఆర్‌ కూడా గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. ప్రధాని పదవిపై ఆశతో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పార్టీని గాలికి వదిలేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ.. పేరు మార్పుతో మరింత డీలా పడింది. అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ డీలా పడడంతో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది. పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవడంతో అదే ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో కనిపించింది. దీంతో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షానికి పరిమితమైంది.

బీఆర్‌ఎస్‌కు ఇక చెక్‌..
ఇక అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. సీనియర్‌ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ కూడా పెద్ద ఎత్తుగడ వేసింది. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రామ్‌నాథ్‌కోవింద్‌ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి..
జమిలి ఎన్నికల విధానం అమలులోకి వస్తే.. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ పెద్దగా ప్రభావం చూపదని అంచనా వేస్తోంది. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని లెక్కలు వేస్తోంది. జమిలి ఎన్నికలతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఆలా కాకపోయినా రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా కమలం నేతలు అంచనా వేస్తున్నారు.