Hyderabad Metro expansion: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్రెడ్డి ఆశిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రుణాలు, ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని టార్గెట్ చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, రుణాలు ఇవ్వొద్దని చెబుతున్నారని, తాను అడిన వెంటనే అడ్డు పుల్ల వేస్తున్నాడని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తనతో కేంద్రం వద్దకు రావడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–1ను ఏప్రిల్ 2026లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్డీకంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న తర్వాత, దాని రీఫైనాన్సింగ్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రూ.13,600 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది.
కేంద్రానికి వినతులు..
ఈ రుణం ఆలస్యంతో అదనపు వడ్డీ భారం రాష్ట్రం, ఐఆర్ఎఫ్సీపై పడుతోందని రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర బీజేపీ నాయకులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని రాష్ట్ర సమస్యల్లో ఇన్వాల్వ్ చేయడానికి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. కిషన్ రెడ్డి ఈ అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేశారు.
భేటీలో ఏం జరిగింది…?
సోమవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్లో రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి కలిసి అశ్విని వైష్ణవ్ను సుమారు రెండు గంటల పాటు కలిశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్–1 రుణ విడుదల, ఫేజ్–2 విస్తరణ (సుమారు 123 కిలోమీటర్లు, విమానాశ్రయం, బయటి ప్రాంతాలను అనుసంధానించే ప్రణాళిక, అంచనా వ్యయం రూ38,595 కోట్లు వరకు), సంబంధిత అనుమతులపై వివరంగా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రకారం, అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేసినట్లు వివరించారు. ఐఆర్ఎఫ్సీ రుణం ఆలస్యం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చర్చించారు. రేవంత్ రెడ్డి భేటీ తర్వాత మీడియాకు మాట్లాడుతూ, ‘‘అశ్విని వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా జరిగాయి. రేపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ ఉంది’’ అని తెలిపారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు.
మీడియాలో వ్యతిరేక కథనాలు..
ఈ భేటీని అధికారికంగా సానుకూలంగా చూసిన మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అవి రాష్ట్ర–కేంద్ర సహకారం, మెట్రో విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రాధాన్యతను హైలైట్ చేశాయి. అయితే బీఆర్ఎస్కు మద్దతుతో నడిచే ఒక మీడియా వాయిస్ మాత్రం ఈ సమావేశాన్ని పూర్తిగా భిన్నంగా చిత్రీకరించింది. ఆ నివేదికలో కేంద్ర మంత్రి రేవంత్రెడ్డిని తీవ్రంగా విమర్శించారని, కిషన్రెడ్డి ముందస్తు ప్రణాళికతో ఆయనను అక్కడికి తీసుకెళ్లి తిట్టించాడని పేర్కొన్నారు. ఇతర మీడియా సంస్థలన్నీ సానుకూలంగా కవర్ చేసినప్పటికీ, ఈ ఒక్కటి అసహనం, విద్వేషంతో నిండిన వివరణ ఇచ్చింది. ఇలాంటి వ్యత్యాసం రాజకీయ పక్షపాతం కారణంగా ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి.
చర్చల్లో చొచ్చి చూసినట్లే..
బీఆర్ఎస్ మీడియా కథనం పరిశీలిస్తే.. చర్చలు జరిగిన సమావేశ మందిరంలో తానూ ఉన్నట్లుగా కథనం వండి వాచ్చింది. అంతర్గత సమాచారం ఎలా లభించిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భేటీలో పాల్గొన్న ముగ్గురు నాయకులు మాత్రమే తెలుసుకోగలిగే విషయాలను ఇతరులు ఎలా తెలుసుకున్నారు? కేవలం సంచలనం కోసమే ఈ కథనం రాశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం రాసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ భేటీ ద్వారా రాష్ట్ర–కేంద్ర సమన్వయం మెరుగుపడి, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, పౌరులకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలు ఇటీవలి అధికారిక ప్రకటనలు, మీడియా నివేదికల ఆధారంగా తెలుస్తోంది.
