HomeతెలంగాణKCR: కేసీఆర్ చెప్పినట్టు వింటున్న హైదరాబాద్ మెట్రో.. చెబుతున్న నష్టాలు మొత్తం అబద్ధమేనా..

KCR: కేసీఆర్ చెప్పినట్టు వింటున్న హైదరాబాద్ మెట్రో.. చెబుతున్న నష్టాలు మొత్తం అబద్ధమేనా..

KCR: ఆ మధ్య హైదరాబాద్ మెట్రో ఎండీ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాడు గుర్తుంది కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం.. మెట్రోను బాగా దెబ్బతీస్తోంది. వచ్చే ప్యాసింజర్లు బాగా తగ్గిపోయారు. ఇలాగైతే మెట్రోను మూసుకోవడమే.. అని అన్నాడు. దానికి తెల్లారి నమస్తే తెలంగాణ తనదైన భాష్యం చెబుతూ.. చూశారా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఎంత నష్టం తెచ్చిందో.. మెట్రో వెళ్ళిపోతుందట.. హైదరాబాద్ ఆదాయం పడిపోతుంది. అదే మా కేసీఆర్ ఉండి ఉంటే ఇట్లుండేదా.. అసలు ప్రజలు మాకు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశారు.. రేవంత్ రెడ్డి ని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు.. అన్నట్టుగా రాసుకు వచ్చింది.. నిజంగానే మెట్రో నష్టాల్లో ఉందా.. మెట్రో ఎండీ వ్యాఖ్యలు చేయడం.. దానికి తగ్గట్టుగా నమస్తే తెలంగాణ మసాలా పూయడం.. భారత రాష్ట్ర సమితి నాయకులు తమదైన శైలిలో విమర్శలు చేయడం.. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని చులకన చేయాలని చూస్తున్నట్టే కనిపిస్తోంది. వాస్తవంగా లోతుగా తవ్వితే మెట్రో చెప్పినట్టుగా ఆ స్థాయిలో నష్టాలు లేవు. కానీ మెట్రో ఎండీ మాత్రం కేసీఆర్ కు ట్యూన్ అయినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు.

హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ప్రయాణికుల ద్వారా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు టికెట్ల విక్రయంతో కోటిన్నర దాకా ఆదాయం వస్తోంది. ఈ ప్రకారం సగటున ఒక్కో ప్రయాణికుడు 35 రూపాయలు చెల్లించి మెట్రోలో ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రకారం సగటు ప్రయాణం దూరం 12.5 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంది. కేవలం ప్రయాణికుల నుంచి చార్జీలు మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనలు, స్టేషన్లు, మాల్స్ లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తోంది. ఈ లెక్కలన్నీ కూడా ఎల్ అండ్ టీ గత ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రకటించినవే.

ఇక ఆపరేషన్లు, ఇతర మార్గాల ద్వారా 703.20 కోట్ల ఆదాయం మెట్రోకు సమకూరింది. మెట్రో నిర్వహణ వ్యయం 429 కోట్లు పోతే.. మిగతాది మొత్తం లాభమే.. మరి మెట్రో ఎండీ చెబుతున్నట్టు నష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. అయితే మెట్రో రైలు, మాల్స్ నిర్మాణానికి 12,500 కోట్లకు పైగా నిధులను ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కొంత ఈక్విటీ, మిగతావి బ్యాంకుల కన్సార్షియం నుంచి అప్పు తీసుకొచ్చింది.. 2023 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఏడాది తీసుకొచ్చిన రుణాలపై వడ్డీనే 1,273 కోట్లను చెల్లిస్తున్నట్టు ఎల్ అండ్ టీ తన వార్షిక ఆర్థిక నివేదికలో ప్రకటించింది. ఈ వడ్డీ బారాన్ని ఎల్ అండ్ టీ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో తగ్గించుకుంది. షాపింగ్ మాల్స్, భూముల సబ్ లీజ్.. వంటి వాటిపై గత ఆర్థిక సంవత్సరం 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని ఒక 1,045 కోట్లకు మానిటైజ్ చేసింది. ఇందులో 512 కోట్లు గత ఏడాది ఎల్ అండ్ టీ సంస్థకు చేరాయి. ఎర్రమంజిల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ ప్రాంతాలలోని షాపింగ్ మాల్స్ ను ఎల్అండ్ టీ మరో సంస్థకు సబ్ లైసెన్స్ కు ఇచ్చింది. వీటి ద్వారా 3,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా 5000 కోట్ల రుణ భారాన్ని దించుకునేందుకు ఎల్ అండ్ టీ సర్దుబాటు చేసింది. దీనివల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకుంది.

ఇలా చేస్తేనే ఆదాయం..

ఎల్ అండ్ టీ మెట్రో ఆదాయం పెరగాలంటే.. ప్రయాణికుల సంఖ్య పెరగాలి.. రద్దీని తట్టుకునేందుకు అదనపు మెట్రో రైళ్లు కావాలి.. కోచ్ ల సంఖ్యను ఆరుకు పెంచుకోవాలి. ప్రయాణికులను చేరవేసే వేళలను పెంచాలి. ప్రస్తుతం సోమ, శుక్రవారం మాత్రమే ప్రయాణికుల వేళలను ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు.. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి.. ప్రతిరోజు పెంచిన వేళల ప్రకారం నడిపితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు రైళ్లు నడిపితే ఆదాయం పెరుగుతుందని రైల్వే రంగ విశ్రాంత నిపుణులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular