Hyderabad Gold Men: పొందూరు కాటన్ వేస్తారు. దానికి తగ్గట్టుగా వైట్ షూ ధరిస్తారు. మెడలో కిలోల కొద్ది బంగారం ధరిస్తారు. చివరికి మహిళలు కూడా అసూయపడే విధంగా బంగారు నగలు వేసుకుంటారు. పశువుల మెడలో వేసే పలుపు తాళ్ల మాదిరిగా బంగారు గొలుసులు ధరించి ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో ప్రత్యేకంగా గ్రూపులు నిర్వహిస్తూ ఉంటారు. సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ ఉంటారు. సదర్ పండుగలు.. బోనాల పండుగలు.. ఇతర వేడుకల సమయంలో బంగారం ధరించి సందడి చేస్తుంటారు. వివిధ సినిమా ఫంక్షన్ల లో కనిపిస్తూ ఉంటారు. ఆటోగ్రాఫ్ లు ఇస్తూ అదరగొడుతుంటారు. చుట్టూ మళ్ళీ మార్బలంతో హల్ చల్ సృష్టిస్తుంటారు.
ఒకప్పుడు ఇటువంటి బంగార్రాజులు ఒకరి ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఇటీవల కాలంలో వీరి సంఖ్య పెరిగిపోయింది. ఓ నివేదిక ప్రకారం హైదరాబాదులో దాదాపు 50 మందికి పైగా ఇటువంటి గోల్డ్ మ్యాన్ లు ఉన్నారు. వీరంతా ఆ స్థాయిలో బంగారం ఎలా సంపాదించారు…. వీరికి ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాల మీద ఆ మధ్య పోలీసులు ఫోకస్ పెట్టడంతో.. వీరి బాగోతం బయటపడింది. తాజాగా తెలంగాణ పోలీసులు అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సూర్య కుమార్ అలియాస్ సూర్య భాయ్ ని అరెస్ట్ చేశారు.
సూర్య ఒంటిమీద బంగారం ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవాడు. ఇతడికి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడు ధరించిన బంగారం నిజమని చాలామంది అప్రోచ్ అయ్యారు. అందులో ఒకడిని సూర్య నిండా ముంచాడు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని హిమాయత్ నగర్ కు చెందిన ఒక కేఫ్ నిర్వాహకుడికి ఏకంగా 32. 30 లక్షలకు ముంచాడు. ఎంతసేపటికి బంగారం ఇవ్వకపోవడంతో ఆ వ్యక్తి సూర్యను నిలదీశాడు. దీంతో మూడు ఐఫోన్లు ఇచ్చాడు. 20 లక్షలకు చెక్కులు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఆ కేఫ్ నిర్వాహకుడు కొంతమందితో కలిసి సూర్య ఇంటికి వెళ్లారు. అక్కడ గొడవ చేయడంతో.. సూర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. సూర్యను పోలీసులు విచారించగా అతని అసలు రంగు బయటపడింది.
సూర్య ధరించేది నిజమైన బంగారం కాదు. అది పూర్తిగా వన్ గ్రామ్ గోల్డ్. హైదరాబాద్ నగరంలో ఉన్న బంగారు బాబులు మొత్తం ధరించేది వన్ గ్రామ్ గోల్డ్ మాత్రమే. హైదరాబాదు నగరంలో నిజమైన గోల్డ్ ధరించే వారు కేవలం ఇద్దరు మాత్రమేనని తెలుస్తోంది వారు కూడా పాత బస్తిలో ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మిగతా వారంతా ఇలా రోల్డ్ గోల్డ్ ధరించి.. జనాలను మోసం చేస్తున్నారని.. సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఇటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
