BRS: బీఆర్ఎస్ ను నెత్తినపెట్టుకుంటున్న ఈనాడు.. ఏంటి కథ?

తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఇది ప్రపంచ స్థాయి అద్భుతం అని కొనియాడారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 22, 2023 11:41 am

BRS

Follow us on

BRS: కేసీఆర్ కారుకు ఎదురుగాలి వీస్తోంది. తన నమస్తే తెలంగాణ కూడా బలంగా నిలబడలేక పోతోంది. రోజుకు పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇలాంటప్పుడే కెసిఆర్ కు ఒక ప్రత్యామ్నాయ మీడియా కావాల్సి వచ్చింది..ఆఫ్ కోర్స్ తెలంగాణలో ఇప్పుడు మీడియా మొత్తం పింక్ రంగు పూసుకుంది కదా! మొన్నటిదాకా కాస్తో కూస్తో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి కూడా సైలెంట్ అయిపోయింది కదా.. మిగతా ఈనాడు అది మరో నమస్తే తెలంగాణ అయిపోయింది. భారత రాష్ట్ర సమితి అడుగులకు మడుగులు ఒత్తుతోంది. కెసిఆర్ ప్రభుత్వ విధానాల మీద రాయకుండా కేవలం పాజిటివిటీ వార్తలతోనే పేజీలు నింపిస్తోంది. అది కూడా నాలుగైదు ఫస్ట్ పేజీలు ప్రింట్ చేస్తోంది.

ఎందుకీ మార్పు

తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఇది ప్రపంచ స్థాయి అద్భుతం అని కొనియాడారు. రామోజీరావు ఇంట్లో ఏ శుభకార్యం అయినా సరే ఈయనే ముందుగా వెళ్లడం మొదలుపెట్టారు. అలా ఈనాడు, కెసిఆర్ మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. అది పెరిగి పెరిగి కెసిఆర్ కు వంత పాడే స్థాయికి ఎగిసింది. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ రాయడం వెనక అసలు కారణం ఇదే. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈనాడు పత్రిక కెసిఆర్ కు, ఆయన పార్టీకి ఎనలేని కవరేజ్ ఇస్తోంది. నాలుగైదు ఫస్ట్ పేజీలు ప్రింట్ చేస్తూ గులాబీ భక్తిని చాటుకుంటున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రేవంతు చేసిన విమర్శలకు, కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలకు తక్కువ స్పేస్ కల్పిస్తోంది. సహజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నచ్చడం లేదు. అందుకే వారు సోషల్ మీడియాలో బలంగా ఈనాడు పత్రికను, రామోజీరావు తీరును విమర్శిస్తున్నారు.

ఆ కృతజ్ఞత గానే..

రామోజీరావు కు సంబంధించిన మార్గదర్శి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇంప్లీడ్ అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన కేసు కాబట్టి మీరు కూడా ఇంప్లీడ్ అవుతారా అని తెలంగాణ ప్రభుత్వానికి కోరితే కెసిఆర్ మరో మాటకు తావులేకుండా నో చెప్పాడు. ఇదే కేసు విషయంలో రామోజీరావును అరెస్టు చేసే అవకాశం వచ్చినప్పటికీ.. అరెస్టు చేయాలని జగన్ కోరినప్పటికీ కెసిఆర్ నో చెప్పాడు. ఎందుకంటే రామోజీరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ ఇటీవల ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్ లో పేర్కొన్నాడు. అందువల్లే రామోజీరావు కెసిఆర్ కు అండగా నిలిచాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్నికల సమయంలో తనకు అండగా లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి రామోజీరావును పెద్దగా ఏమీ అనడం లేదు. ఎందుకంటే రామోజీరావును విమర్శిస్తే కమ్మ ఓటు బ్యాంకు మీద ప్రభావం పడుతుంది కాబట్టి.. ప్రస్తుతం సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో పార్టీకి ఇది మంచిది కాదు కాబట్టి.. రేవంత్ రెడ్డి ఈనాడు విషయంలో సైలెంట్ గా ఉంటున్నాడు. కాకపోతే ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది అనిపించడం లేదు.