TS DSC: డీఎస్సీ వివాదం : తప్పు రేవంత్‌ సర్కార్‌ దా? నిరుద్యోగులదా?

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాన విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ డీఎస్సీ. ఫిబ్రవరిలో రేవంత్‌ సర్కార్‌ 11,062 చీటర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కేవలం 5,089 పోస్టులతో సెప్టెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.

Written By: Raj Shekar, Updated On : July 9, 2024 1:04 pm

TS DSC

Follow us on

TS DSC:  తెలంగాణలో డీఎస్సీ వాయిదా ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతోపాటు, అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. వారం రోజులుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేస్తున్నారు. సోమవారం (జూలై 8న) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒకవైపు అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలోనే ప్రభుత్వం డీఎస్పీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు ఉంటాయని, జూలై 11 నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. దీంతో అభ్యర్థులు అర్ధరాత్రి కూడా పోరాటం కొనసాగించారు.

నోటిఫికేషన్‌ ఇలా..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాన విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ డీఎస్సీ. ఫిబ్రవరిలో రేవంత్‌ సర్కార్‌ 11,062 చీటర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంతకుముందు 2023లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కేవలం 5,089 పోస్టులతో సెప్టెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫకేషన్‌ రద్దు చేసి, దానికి కొత్తగా మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు.

తర్వాత టెట్‌ నోటిఫికేషన్‌
ఇదిలా ఉంటే.. డీఎస్సీ ఉద్యోగాలు పెరగడంతో డీఎస్సీ పరీక్ష కంటే ముందు టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో రేవంత్‌ సర్కార్‌ మరింత మందికి అవకాశం కల్పించేలా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది జూన్‌లో పరీక్ష నిర్వహించి అదే నెలలో ఫలితాలు ప్రకటించింది.

డీఎస్పీ పరీక్షకు రెడీ..
ఇక డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రేవంత్‌ సర్కార్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. వాస్తవంగా డీఎస్సీ మొదటి నోటిఫికేషన్‌ గత సెప్టెంబర్‌లో వచ్చింది. దానిని పరిగణనలోకి తీసుకుంటే.. నోటిఫికేషన్‌ వచ్చి 10 నెలలు కావస్తోంది. చాలా మంది అభ్యర్థులు పది నెలలుగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూన్‌లో కొత్తగా టెట్‌ రాసిన కొంతమంది కోసం డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరండం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు రేవంత్‌ సర్కార్‌ ప్రస్తుతం డీఎస్సీ నిర్వహిస్తే ఇటీవల చేపట్టిన ప్రమోషన్లతో మరో నోటిఫికేషన్‌ ఇవ్వొచ్చని భావిస్తోంది. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కానీ అభ్యర్థుల మాత్రం పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా ఇదే నోటిఫికేషన్‌లో భర్తీ చేయాలని, ఆమేరకు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు.

తెరవెనుక బీఆర్‌ఎస్, కేటీఆర్‌..
ఇక డీఎస్సీ ఉద్యమం వాయిదా వెనుక బీఆర్‌ఎస్‌ నేతలు, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగానే రేవంత్‌ సర్కార్‌ ఫిబ్రవరిలో అదనపు పోస్టులు జోడించిందని. గత నోటిఫికేషన్‌ ప్రకారం.. నవంబర్‌లోనే పరీక్షలు నిర్వహించాలని, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అయినా తెరవెనుక బీఆర్‌ఎస్‌ ఉండి ఉద్యమాన్ని నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాదంలో తప్పెవరిది..
ఇదిలా ఉంటే.. పది నెలలుగా డీఎస్సీ కోసం సన్నద్ధం అవుతున్నవారు కూడా తాజా ఉద్యమంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే తాము వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ తీసుకున్నామని, దాదాపు ఏడాదిగా ప్రిపరేషన్‌లో ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ సమయంలో పరీక్ష వాయిదా వేయడం సరికాదంటున్నారు. త్వరగా ఈ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే.. ఉపాధ్యాయుల పదోన్నతి తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్నా.. రేవంత్‌ సర్కార్‌ కూడా ఇప్పటికే డీఎస్సీ నిర్వహణ ఆలస్యమైందన్న భావనలో ఉంది. అందుకే నిరసనలను లెక్క చేయకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది.