HomeతెలంగాణLok Sabha Election Results 2024: తెలంగాణలో కాంగ్రెస్ బోణి.. ఎంపీగా విక్టరీ వెంకటేష్, పొంగులేటి...

Lok Sabha Election Results 2024: తెలంగాణలో కాంగ్రెస్ బోణి.. ఎంపీగా విక్టరీ వెంకటేష్, పొంగులేటి వియ్యంకుడు.. మెజారిటీ ఎంతంటే?

Lok Sabha Election Results 2024: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. మంగళవారం నిర్వహించిన లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి 3.5 లక్షలకు పైగా ఓట్ల తేడాతో తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి నామ నాగేశ్వరరావు పై విజయం సాధించారు. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నప్పటికీ.. భారీ మెజారిటీ సాధించి రఘురామిరెడ్డి చరిత్ర సృష్టించారు. రఘురామిరెడ్డి సినీ హీరో వెంకటేష్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యంకుడు. ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో వెంకటేష్ సందడి చేశారు.. తన వియ్యంకుడి తరఫున ఖమ్మంలో క్యాంపెనింగ్ లో పాల్గొన్నారు. మరోవైపు శ్రీనివాసరెడ్డి కూడా రఘురామిరెడ్డి విజయంలో అన్ని తానై వ్యవహరించారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానంలో 3.5 లక్షల మెజారిటీ ఓట్లతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు రఘురామిరెడ్డి. ఈ పార్లమెంటు స్థానంలో 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధించింది. 2009లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నామ నాగేశ్వరరావు ఎంపి గా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున రఘురామిరెడ్డి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 3.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ పార్లమెంటు స్థానంలో భారత రాష్ట్ర సమితి తరఫున నామ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ తరఫున తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు.. అయితే వీరెవరు కూడా రఘురామిరెడ్డికి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈ జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. రఘురామిరెడ్డి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ.. రఘురామిరెడ్డి విజయం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. విభేదాలను పక్కనపెట్టి ఏకపక్ష విజయం దక్కేలా చూశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుచుకున్న ఎంపీలలో రఘురామిరెడ్డిదే హైయెస్ట్ మెజారిటీ కావడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version