Akun Sabharwal : మరో సంచలన అధికారిని తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి.. ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్ అయిన తెలంగాణ డ్రగ్స్ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Neelambaram, Updated On : October 15, 2024 4:42 pm

Akun Sabharwal

Follow us on

Akun Sabharwal : డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని అర్థం అవుతోంది. ఇందుకోసం ఆయన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకరణ సందర్భంలోనూ రేవంత్ డ్రగ్స్ మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మారుస్తానంటూ శపథం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్ అయిన తెలంగాణ డ్రగ్స్ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసిన సందర్భంగా సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీని కూడా ప్రస్తావించారు. నాగచైతన్య-సమంత విడాకుల అంశాన్ని ఆమె లేవనెత్తారు. దాంతో నాగార్జున ఆ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్నారు. అటు యావత్ టాలీవుడ్ సినీ ప్రపంచం కూడా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దాంతో ప్రతిపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసినప్పటికీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. అలాగే.. నంది అవార్డులను కాస్త గద్దర్ అవార్డులుగా మార్చినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక దాంతో అప్పటి నుంచే టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా కోల్డ్‌వార్ నడుస్తూనే ఉంది. సురేఖ వ్యాఖ్యలపై ఒక్కసారిగా అందరూ ముందుకు రావడంతో ప్రభుత్వం పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నారు.

ఇందులో భాగంగానే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును మరోసారి తెరమీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. అందుకే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అకున్ సబర్వాల్‌ను మరోసారి తెలంగాణకు తీసుకొస్తున్నారు. మరోసారి ఆ కేసును తోడి అందులో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ అప్పీల్‌తో పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా షార్ట్ వీడియోలు చేసి ప్రచారం సాగిస్తున్నప్పటికీ.. ఇంకా చాలా మంది టాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని అపవాదు ఉంది.

అందుకే..ఈ కేసుపై పూర్తి అవగాహన ఉన్న అకున్ సబర్వాల్‌ను మరోసారి రంగంలోకి దింపబోతోంది. అకున్ ఎంట్రీతో మరోసారి టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలు కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులను ఆయన విచారించారు. ఇంకా కొంత మందిని విచారించే క్రమంలో ఆయనను బదిలీ తప్పలేదు. దాంతో అప్పటి నుంచి ఆ కేసు మూలనపడింది. ఇక ఇప్పుడు ఆయన రాకతో ఈ డ్రగ్స్ కేసు ఎటు మలుపు తిరుగుతుందా అని ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఆ టెన్షన్ మరింత ఎక్కువైనట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేటుగా మార్చే క్రమంలో రేవంత్ సర్కార్ మరోసారి టాలీవుడ్ నుంచే తన పనిని మొదలుపెట్టబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.