Ex Minister Babumohan : తెలంగాణలో తెలుగుదేశం అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నెలలు రెండు రోజులు పాటు అక్కడ పార్టీ కోసం సమయం కేటాయించనున్నారు. ఆదివారం సాయంత్రం పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు పై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఆన్లైన్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడుతున్నామని.. ఎవరు ఎక్కువగా సభ్యత్వ నమోదు చేస్తే వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని కూడా తేల్చి చెప్పారు చంద్రబాబు. మరోవైపు వివిధ కారణాలతో పార్టీని వీడిన నేతల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లోకి వెళ్లిన నేతలు తిరిగి టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి వారితో సంప్రదింపులు జరపాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. 2014 రాష్ట్ర విభజన తర్వాత చాలామంది నేతలు పార్టీని వీడారు. అటువంటివారు తిరిగి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఏపీలో అత్యధిక మెజారిటీతో గెలవడంతో పాటు జాతీయస్థాయిలో టిడిపి కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో నేతలు టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
* చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి
తాజాగా మాజీ మంత్రి, సినీ నటుడు బాబూ మోహన్ చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘకాలం బాబూ మోహన్ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన సొంత నియోజకవర్గం ఆంధో ల్. గతంలో రెండు సార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, 2014లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత, మంత్రి దామోదర్ రాజనర్సింహను రెండుసార్లు ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు.
* బిజెపిలోకి
2018లో బాబూ మోహన్ కు టిక్కెట్ ఇచ్చేందుకు కేసిఆర్ నిరాకరించారు. సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ ను ఆంధోల్ నుంచి పోటీకి దింపారు. టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్ బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బిజెపిలో కొనసాగారు బాబూ మోహన్. ఆ తరువాత రాజీనామా చేసి కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనలేదు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న బాబూమోహన్ బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* టిడిపిలోనే మంత్రిగా
చంద్రబాబు హయాంలోనే బాబూ మోహన్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు బాబూ మోహన్ ను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చారు. దామోదర రాజనర్సింహ పై భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో బాబూ మోహన్ ఫెయిల్ అయ్యారు.తరచూ పార్టీలుమారుతుండడంతో ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారు. చంద్రబాబు వద్ద సంసిద్ధత ప్రకటించారు. దీంతో త్వరలో ఆయన టిడిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More