Mahabubabad: వైరల్ ఫోటో: క్వార్టర్ సీసాలు, హాఫ్ బాటిళ్ళు: కెసిఆర్ పట్ల వినూత్న కృతజ్ఞత

తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ద్వారా భారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా మరిన్ని వైన్ షాపులు ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేర్పులు చేసి మామూలు పట్టణంలో కూడా బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది.

Written By: Bhaskar, Updated On : May 21, 2023 3:41 pm

Mahabubabad

Follow us on

Mahabubabad: ఎవరైనా మనకు సహాయం చేస్తే వారి పట్ల కృతజ్ఞత చూపిస్తాం. అది మనిషి సహజ లక్షణం. అయితే కొంతమంది అభిమానం వినూత్నంగా ఉంటుంది. అది చూసిన వారు ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. ఇలాంటి ఆశ్చర్యపడే పనిని మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది బార్ షాపు నిర్వాహకులు చేశారు. వారు తెలిపిన ఆ కృతజ్ఞత ఆ నోటా ఈ నోటా పడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ వారు ఏం చేశారు మీరూ చదివేయండి.

అనుమతి ఇవ్వడంతో..

తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ద్వారా భారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా మరిన్ని వైన్ షాపులు ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేర్పులు చేసి మామూలు పట్టణంలో కూడా బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు విధించడంతో బార్ షాపు నిర్వాహకుల ఆదాయం మీద దెబ్బ పడ్డది. దీంతో వారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కు తమ సమస్యలు చెప్పుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కొంతమంది ధైర్యం చేసి ఏకంగా ముఖ్యమంత్రిని కలిశారు. వారి బాధలు సావధానంగా విన్న ఆయన వెంటనే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ షాప్ నిర్వాహకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఫోటో ముందు మందు బాటిళ్ళు ఉంచి..

తమ వ్యాపారానికి మూల కారణమైన మద్యం బాటిళ్ళను ముఖ్యమంత్రి చిత్రపటం ముందు బార్ షాప్ నిర్వాహకులు గురించి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గతంలో బార్ షాపుల్లో 90ఎంఎల్, క్వార్టర్, ఆఫ్ బాటిళ్ళ విక్రయానికి అనుమతి ఉండేది కాదు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల వాటిని విక్రయించేందుకు మార్గం ఏర్పడింది. పైగా ఇది తమ వ్యాపారానికి బాగా ఉపకరిస్తుందని బార్ షాప్ యజమానులు భావించి.. ముఖ్యమంత్రి ఫోటోను తమ బార్ షాపుల ఎదుట ఉంచి క్వార్టర్, ఆఫ్ బాటిళ్ళ తో కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం బార్ షాపుల యజమానులు చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఆఫర్లు కూడా ప్రకటించారు

అయితే తమ వ్యాపారం లాభాల్లోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయమే కారణమని భావించిన బార్ షాపుల నిర్వాహకులు మందుబాబుల కోసం ప్రత్యేకంగా ఆఫర్లు కూడా పెట్టారు. ఖరీదైన బ్రాండ్ల కు సంబంధించిన మద్యం కూడా లూజుగా విక్రయిస్తామని షాపుల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఖరీదైన బ్రాండ్లకు సంబంధించి ఆఫ్ బాటిల్స్ ఒక బాక్స్ తీసుకుంటే ఒక బాటిల్ ఉచితమని ప్రకటించారు. అయితే వారు ప్రకటించిన ఆఫర్ కు అంతంతమాత్రంగానే మందుబాబుల నుంచి స్పందన వస్తోంది.