Abhishek Sharma hospitalised: టీమిండియాలో ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో అభిషేక్ శర్మ స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నాడు. బీభత్సంగా పరుగులు చేస్తూ.. అదరగొడుతున్నాడు…
టి20 వరల్డ్ కప్ లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ గొప్పగా ఆడలేదు. తన స్థాయికి తగ్గట్టుగా పరుగులు తీయలేదు. అమెరికాతో మ్యాచ్ లో భారత్ తీవ్రంగా శ్రమించింది. సూర్య కుమార్ యాదవ్ గనుక లేకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అభిషేక్ శర్మ అలా అవుట్ కావడం అభిమానులకు నిరాశ కలిగించింది.
అభిషేక్ శర్మకు సంబంధించిన ఇప్పుడు ఒక విషయం తెరపైకి వచ్చింది. నమిబియాతో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండడు. దీనికి ప్రధాన కారణం అతడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడమే. అందువల్లే అతడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు అక్కడ అత్యవసరమైన వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నాడు. దీంతో నమీబియా తో జరిగే మ్యాచ్ కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ ఇటీవల కాలంలో సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మైదానం ఏదైనా సరే.. ప్రత్యర్థి ఏ జట్టు అయినా సరే బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. ఫోర్లు.. సిక్సర్ లను అవలీలగా కోరుతూ తన స్థాయి నిరూపించుకుంటున్నాడు. అందువల్లే అభిషేక్ శర్మ అంటే ప్రేక్షకులు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అతడు ఆడుతున్నంత సేపు మైదానంలో నినాదాలు చేస్తున్నారు.
ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. ఇలా ఆడావు ఏంటి అని అభిషేక్ శర్మ ను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వాస్తవానికి అభిషేక్ శర్మ అమెరికా మీద దుమ్మురేపుతాడని అందరూ అనుకున్నారు. సరికొత్త రికార్డు సృష్టిస్తాడని ఊహించారు. కానీ అతడు ఆ స్థాయిలో ఆడలేకపోయాడు. కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు కూడా తీయలేకపోయాడు.
అభిషేక్ శర్మకు కడుపునొప్పి రావడానికి ప్రధాన కారణం ఫుడ్ ఇన్ఫెక్షన్ అని తెలుస్తోంది. అందువల్లే అతడు ఆసుపత్రి పాలయ్యాడని సమాచారం. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. నమిబియా జట్టుతో జరిగే మ్యాచ్ కు అతడు దూరంగా ఉంటాడని.. ఆ తర్వాత జట్టులోకి వస్తాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.