Virat Kohli: ఓటమి బాధలో ఆర్సీబీ.. ఎవరికీ పట్టని కోహ్లీ రికార్డు ఇదే..!

క్రికెట్‌లో ఫార్మాట్‌ ఏదైనా సచిన తర్వాత రికార్డులు సృష్టించడం ఒక్క కింగ్‌ కోహ్లీకే సాధ్యమైంది. వన్డే, టెస్టు, టీ–20, ఐపీఎల్‌ ఏ ఫార్మట్‌ అయినా నిలకడైన ప్లేయర్‌ ఎవరంటే కోహ్లి పేరే ముంద వినిపిస్తుంది.

Written By: Raj Shekar, Updated On : May 23, 2024 1:42 pm

Virat Kohli

Follow us on

Virat Kohli: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17వ సీజన్‌ తుది అంకానికి చేరింది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడు జట్లు కప్పు రేసులో నిలిచాయి. ఇక బుధవారం(మే 22న) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. 17 ఏళ్లలో కప్పు అందుకోలేకపోయిన ఈ జట్టు.. ఈ సారి ఆ కోరిక నెరవేర్చుకోవాలని భావించింది. కానీ, ప్లే ఆఫ్‌లోనే నిష్క్రమించాల్సి రావడంతో జట్టుతోపాటు ఆ టీం ఫ్యాన్స్‌ కూడా బాధలో ఉన్నారు. దీంతో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో స్టార్‌ క్రికెటర్‌ కోహ్లీ సాధించిన అరుదైన రికార్డును ఎవరూ పట్టించుకోవడం లేదు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా కోహ్లీ ఈ రికార్డు సృష్టించాడు.

రికార్డులు కింగ్‌ సొంతం..
క్రికెట్‌లో ఫార్మాట్‌ ఏదైనా సచిన తర్వాత రికార్డులు సృష్టించడం ఒక్క కింగ్‌ కోహ్లీకే సాధ్యమైంది. వన్డే, టెస్టు, టీ–20, ఐపీఎల్‌ ఏ ఫార్మట్‌ అయినా నిలకడైన ప్లేయర్‌ ఎవరంటే కోహ్లి పేరే ముంద వినిపిస్తుంది. అన్ని ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తూ అలాంటి గణాంకాలు అన్ని నమోదు చేశాడు కోహ్లి. అన్ని ఫార్మాట్లలో మంచి యావరేజ్‌ మెయింటేన్‌ చేస్తున్నాడు.

ఐపీఎల్‌లో తిరుగులేదని..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు ఆయన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు. ఈ టోర్నీలోనూ అత్యధిక పరుగులు చేశాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు, అధిక సెంచరీలు కోహ్లి పేరిటే ఉన్నాయి. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విరాట్‌ మరో మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్‌లో 8 వేలు పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కాడు. మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయికి 29 పరుగుల దూరంలో ఉండగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 24 బంతుల్లోనే 33 రన్స్‌ చేసి ఆ మైలురాయిని అధిగమిచాడు. మొత్తంగా కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడి, 8004 రన్స్‌ చేశాడు. 38.67 సగటు, 131.97 స్ట్రైక్‌ రేట్‌ తో ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 8 సెంచరీలు చేసిన టాప్‌లోనే ఉన్నాడు.

దరిదాపుల్లో కానరాని క్రికెటర్లు..
ఇదిలా ఉంటే కోహ్లి రికార్డు బ్రేక్‌ చేయడానికి ఆయన దరిదాపుల్లో ఏ క్రికెటర్‌ కనిపించడం లేదు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో స్థానంలో కూడా భారత్‌కు చెందిన ప్లేయర్, పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ధావన్‌ 6,769 పరుగులతో ఉన్నాడు. తర్వాత రోహిత్‌ శర్మ (6,628), డేవిడ్‌ వార్నర్‌ (6,565), సురేశ్‌ రైనా (5,528) మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉ న్నారు. విరాట్‌ రికార్డు ఇప్పట్లో చెక్కుచెదిరేలా లేదు.