Delhi Capitals
Delhi Capitals: ఐపీఎల్ నుంచి లక్నో జట్టు దాదాపుగా బయటకు వెళ్లిపోయినట్టే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోయింది.. ఢిల్లీ చేతిలో 19 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్ వెళ్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. కేవలం సాంకేతికంగా మాత్రమే ఢిల్లీ జట్టు ముందు వరసలో నిలిచింది. 14 పాయింట్లు సాధించి, దేవుడిపై భారమే వేసింది. 14 మ్యాచులు ఆడిన ఢిల్లీ, ఇప్పటివరకు ఏడు విజయాలు అందుకుంది. 14 పాయింట్లు తన ఖాతాలో కలిగి ఉంది. రాజస్థాన్, కోల్ కతా జట్లు మాత్రమే ఇప్పటివరకు 19, 16 పాయింట్లు సాధించగలిగాయి. మిగతా జట్లు 14 పాయింట్ల లోపే కొనసాగిన పక్షంలో ఢిల్లీ ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 208 రన్స్ చేసింది. అభిషేక్ పోరల్ 58, స్టబ్స్ 57 అర్థ శతకాలతో అదరగొట్టారు. అనంతరం లక్నో తొమ్మిది వికెట్లు కోల్పోయి 189 రన్స్ మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ 61, అర్షద్ ఖాన్ 58 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ 5 పరుగులు మాత్రమే చేసి.. నిరాశపరచాడు. ఇతడిని ఇషాంత్ శర్మ అద్భుతమైన బంతితో వెనక్కి పంపించాడు. ప్రమాదకరమైన డికాక్ కూడా 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇతడు కూడా ఇషాంత్ శర్మ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టోయినిస్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. దీపక్ కూడా 0 పరుగులకే వెనుతిరిగాడు. అప్పటికే లక్నో జట్టు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. 44/4 తో ఉన్న లక్నో జట్టును నికోలస్ పూరన్ ఆదుకున్నాడు. ఇతడు తన బ్యాటింగ్ దూకుడుతో జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడిపోతున్నప్పటికీ, అతను మాత్రం అదే దూకుడు కొనసాగించాడు. 20 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పూరన్ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో, అతడిని ముఖేష్ చౌదరి అద్భుతమైన బంతితో వెనక్కి పంపించాడు. కానీ ఈ దశలో అర్షద్ ఖాన్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ లక్నో ను టచ్ లోకి తెచ్చాడు. 25 బంతుల్లోనే మెరుపు అర్థ శతకం బాదాడు. తన దూకుడైన బ్యాటింగ్ తో లక్నో లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. ఒకానొక దశలో గెలుపు దాకా తీసుకెళ్లాడు. చివరి ఆరు బంతుల్లో 23 పరుగులకు విజయ సమీకరణాన్ని మార్చాడు. అయితే చివరి ఓవర్లో రసిక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కీలకమైన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని ఢిల్లీ ధైర్యంగా నిలబడగలిగింది. సాంకేతికంగా ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.