Vaibhav Suryavanshi: ఈ ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు ప్రారంభంలో అదరగొట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా ఓటములను చవిచూస్తోంది. తాజాగా శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో సొంత మైదానంలో ఓడిపోయింది. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.
ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలాగా నిలుస్తున్నాడు 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ. శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీ చేశాడు. 37 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు.. ఇందులో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు అత్యంత వేగంతో సెంచరీ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాజస్థాన్ జట్టు ఓటమిపాలైంది.
ఈ ఓటమి తాలుకు బాధ నుంచి రాజస్థాన్ జట్టు ఇంకా తేరుకోలేదు. అది మర్చిపోకముందే రాజస్థాన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్య వంశీ గాయపడ్డాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని ఆపడానికి ప్రయత్నించగా.. అతడు మైదానంలోనే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అడుగు తీసి అడుగు వేయడానికి కష్టపడ్డాడు. దీంతో వైద్యులు వెంటనే మైదానంలోకి వచ్చారు. అతడిని పరీక్షించారు. మొదట్లో అతడికి క్రాంప్స్ వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ అతనికి గాయమైనట్టు తెలుస్తోంది.
రాజస్థాన్ జట్టులో సూర్య వంశీ సుదీర్ఘంగా బ్యాట్ చేశాడు. ప్రారంభం నుంచి సెంచరీ దాకా వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే అతడు గాయపడి ఉంటాడని విశ్లేషకులు చెబుతున్నారు.. అతడి వయసు 15 సంవత్సరాలు కావడంవల్ల.. ఎక్కువసేపు క్రికెట్ ఆడటం వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురై ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. నొప్పితో విలవిలాడిపోయిన సూర్య వంశీ.. కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వైభవ్ సూర్య వంశీ తదుపరి మ్యాచ్లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.
ఈ మ్యాచ్ కంటే ముందు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ పోరు జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. బంతి అందుకునే క్రమంలో అతడి తల మైదానానికి గుద్దుకుంది. దీంతో అతడు స్పృహ తప్పిపోయాడు. అంబులెన్స్ మైదానానికి రప్పించి అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఎంగిడి గాయాన్ని మర్చిపోకముందే.. సూర్య వంశీ గాయపడ్డాడు. వీరిద్దరి మాత్రమే కాదు… ఇప్పటికే చాలామంది ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. వారంతా కూడా ఐపీఎల్ టోర్నీల నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో సూర్య వంశీ కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే గనక జరిగితే రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం కష్టంగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.