
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ సీజన్గా రికార్డుల్లో నిలిచింది. అభిమానుల కేరింతలు లేకున్నా.. హంగామా లేకున్నా.. చరిత్ర సృష్టించింది. టోర్నీ లీగ్ దశ మ్యాచ్లు మంగళవారంతో ముగియనుండగా.. ఒక్క ముంబయి ఇండియన్స్ మినహా ఏ జట్టూ ప్లేఆఫ్కి అర్హత సాధించలేదు. మిగిలిన మూడు ప్లేఆఫ్ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీపడుతుండగా.. ఆదివారం మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
అయితే.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన జట్టు కూడా ఏకంగా 12 పాయింట్లు సాధించడం 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఐపీఎల్ 2019 సీజన్లో కేవలం 12 పాయింట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ చివరి ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకున్న విషయం తెలిసిందే. అలానే చెన్నై టీమ్ ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఆడకుండా ఇంటిబాట పట్టడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శనివారం వరకూ చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగిలిన ఏడు జట్లూ ప్లేఆఫ్ రేసులోనే ఉన్నాయి. దాంతో.. అభిమానులు కూడా టోర్నీపై అమితాసక్తి ప్రదర్శిస్తూ.. ప్లేఆఫ్ చేరే జట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ.. ఆదివారం రెండు మ్యాచ్ల్లో నాలుగు జట్లు పోటీపడగా.. చెన్నై తనతోపాటు పంజాబ్ని కూడా ఇంటికి తీసుకెళ్లింది. ఇక రాజస్థాన్ని 60 పరుగుల తేడాతో ఓడించిన కోల్కతా.. ఆ జట్టుని ఇంటిబాట పట్టించినా.. తనకి ప్లేఆఫ్ బెర్తు దక్కుతుందనే గ్యారంటీ లేదు. లీగ్ దశ సగం మ్యాచ్లు ముగిసే సమయానికే టాప్-3లో చోటు దక్కించుకున్న బెంగళూరు, ఢిల్లీ వరుస పరాజయాలతో అసలుకే ఎసరు పెట్టుకున్నాయి.
ఈ విషయంలో ముంబయికి ఉన్న తెలివి, లౌక్యం మిగిలిన బెంగళూరు, ఢిల్లీకి లేకుండా పోయింది. దాంతో సులువుగా ప్లేఆఫ్ చేరాల్సిన ఆ జట్లు ఇప్పుడు చావోరేవో పోరులో సోమవారం తలపడాల్సి వచ్చింది. గెలిచిన జట్టు ప్లేఆఫ్కి చేరితే.. ఓడిన జట్టు భవితవ్యం మంగళవారం తేలనుంది. మొత్తంగా తాజా సీజన్లో ముంబయి మినహా ఏ జట్టు ప్రయాణం కూడా సాఫీగా సాగలేదు. టోర్నీలోని ప్రతి జట్టూ.. మిగిలిన జట్లకి గట్టి పోటీనిచ్చింది. గతంలో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లు.. టాప్లో ఉన్న టీమ్స్కి పెద్దగా పోటీనిచ్చేవి కావు. కానీ.. తాజా సీజన్లో మాత్రం టాప్లో ఉన్న జట్లకి చెమటలు పట్టించి.. వాటి ప్లేఆఫ్ అవకాశాల్ని దెబ్బతీశాయి.