India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి ఎందుకు అలా తీసుకుంటాడో తెలియదు. అప్పటికప్పుడు మార్పులు ఎందుకు చేపడతాడో అర్థం కాదు. దీనివల్ల టీమిండియా తీవ్రమైన ప్రతికూల ఫలితాలను చూస్తోంది. భారత క్రికెట్ జట్టు చరిత్రలోనే ఎన్నడూ ఊహించని విధంగా ఓటములను చవిచూస్తోంది.
టీమిండియా ఇలా వరుసగా ఓటములను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జట్టు ఇలా కావడానికి ప్రధాన కారణం గౌతం గంభీర్ అని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. అతడిని జట్టు కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే దక్షిణాఫ్రికా వరకు వరుసగా టీమిండియా సిరీస్ లను కోల్పోయింది. రెడ్..వైట్ బాల్ ఫార్మాట్ లలో తీవ్రస్థాయిలో ఓటములను ఎదుర్కొంది.
ఇటీవల ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో టి20, వన్డే సిరీస్ లను టీమిండియా కోల్పోయింది.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో ఏకంగా వైట్ వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ కు రెస్ట్ ఇచ్చింది. అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ను జింబాబ్వే కు పంపించింది. లక్ష్మణ్ నాయకత్వంలో టీమిండి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపును దక్కించుకుంది. ఆరు వరుస ఓటముల తర్వాత టీమిండియా గెలిచింది. ఈ గెలుపు నేపథ్యంలో సోషల్ మీడియాలో గంభీర్ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా పాలిట గౌతమ్ గంభీర్ శని లాగా దాపురించాడని.. అతడిని పక్కనపెట్టి లక్ష్మణ్ కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
“గంభీర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాడు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్లేయర్లను పదే పదే మార్చుతూ ఉంటాడు. దీనివల్ల ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుంది. వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందువల్లే సరైన స్థాయిలో వారు ఆట మీద మనసు లగ్నం చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని గుర్తించాలి. గంభీర్ ను పక్కన పెట్టాలని” అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. గౌతమ్ గంభీర్ పదవికాలం ముగిసిన తర్వాత లక్ష్మణ్ ను కోచ్ గా నియమిస్తారని జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.



