Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టుకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హైదరాబాద్ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తారు. పరుగులను సునాయాసంగా తీస్తారు. అందువల్లే హైదరాబాద్ ప్లేయర్లను కాటేరమ్మ కొడుకులు అని పిలుస్తారు. మిగతా జట్లు ఆడుతున్నప్పుడు గెలిస్తే చాలు అనుకుంటాయి. కానీ హైదరాబాద్ జట్టు ఆడుతున్నప్పుడు గెలవడం మాత్రమే కాదు.. రికార్డులు బద్దలు ఎలా కొట్టాలో ఆలోచిస్తూ ఉంటుంది. అదే మిగతా జట్లను సన్ రైజర్స్ ను ప్రత్యేకంగా ఐపీఎల్లో చూపుతూ ఉంటుంది.
ఈ సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడింది. గొప్ప గొప్ప జట్లను ఓడించి ప్లే ఆఫ్ దాకా వచ్చింది. దీంతో హైదరాబాద్ జట్టు ట్రోఫీ గెలుస్తుందని.. 2026 లో 2016 నాటి సీన్ రిపీట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను హైదరాబాద్ జట్టు ప్లేయర్లు తలకిందులు చేశారు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. అసలు ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇలా ఎందుకు ఆడారు.. ఆర్ ఆర్ ముందు ఎందుకు తలవంచారు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. భయంకరంగా బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. హెడ్ తన విశ్వరూపం చూపించలేకపోయాడు..క్లాసెన్ తన మార్క్ ఆట తీరును చూపించలేదు. ఇషాన్ మెరుపులు సరిపోలేదు. కీలకమైన ప్లేయర్లు చేతులెత్తేయడంతో హైదరాబాద్ జట్టు దారుణమైన ఓటమి మూట కట్టకుంది..
ఈ సీజన్లో క్లాసెన్ 624 పరుగులు చేశాడు. ఈశాన్ 602 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 563 పరుగులు చేశాడు. హెడ్ 410 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 302 పరుగులతో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇషాన్ మాలింగ 20 వికెట్లు సాధించాడు. సాకిబ్ 15 వికెట్లు, ప్రపుల్ 14.. శివాంగ్ తొమ్మిది.. కమిన్స్ ఎనిమిది వికెట్లను పడగొట్టారు. ఈ స్థాయిలో ఆడినప్పటికీ హైదరాబాద్ జట్టు అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఓడిపోవడం విశేషం. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ప్లే ఆఫ్ మ్యాచ్లో సరైన ప్రణాళికలు కూడా అమలు చేయలేకపోయింది హైదరాబాద్ జట్టు. ఫలితంగా ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది.
కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తరుపున కొంతమంది ఆటగాళ్లు సత్తా చూపిస్తే తిరుగు ఉండేది కాదు. ముఖ్యంగా టాస్ గెలిచినప్పుడు కెప్టెన్ వెంటనే బ్యాటింగ్ వైపు ఆసక్తి చూపించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ప్రధాన అవరోధం. బౌలింగ్లో వైవిద్యం లేకపోవడం కూడా జట్టు ఓటమికి కారణమైంది. అభిషేక్ శర్మ తేలిపోవడం హైదరాబాద్ జట్టు పతనానికి దారితీసింది.
