India vs Ireland: ఐర్లాండ్ జట్టుతో మ్యాచ్.. టీమిండియా గెలుపు మీద ఎవరికి అనుమానాలు లేవు. పైగా అభిషేక్ శర్మ నుంచి మొదలు పెడితే శివం దుబే వరకు భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఐర్లాండ్ జట్టుకు వారి సొంత దేశంలోనే చుక్కలు తప్పవని టీమిండియా అభిమానులు ఒక అంచనాకు వచ్చారు.. కానీ వారి అంచనాలు తప్పని ఐర్లాండ్ ప్లేయర్లు నిరూపించారు. బలమైన టీం ఇండియాను.. అదికూడా టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టీం ఇండియాను.. ఇటీవల టి20 వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియాను ఓడించారు.
Also Read: వైభవ్ కు నో ఎంట్రీ.. తన అనుచరుడు హర్షిత్ కు ఛాన్స్.. గంభీర్ ఇక మారడా.
ఐర్లాండ్ సాధించిన గెలుపు చిన్నది ఏం కాదు. వారు ఆషామాషిగా ఆడలేదు. బ్యాటింగ్ బాగా చేశారు. బౌలింగ్ బాగా వేశారు. ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. టీమిండియాలో అభిషేక్ శర్మ 50.. శివమ్ దుబే 25 మినహా మిగతా ప్లేయర్లు దారుణంగా ఆడారు.. సంజు శాంసన్ 5, ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ అయ్యర్ 3, వాషింగ్టన్ సుందర్ 9.. హర్షిత్ రానా 8, అర్ష్ దీప్ సింగ్ రెండు పరుగులు మాత్రమే చేశారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కు పరిమితం కావడం అత్యంత దారుణం.
అయ్యర్ కు ఇది సారధిగా తొలి మ్యాచ్. వాస్తవానికి అతడు మ్యాచ్లో అదరగొడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 7 బంతులు మాత్రమే ఎదుర్కొని మూడు పరుగులు చేశాడు. అది కూడా అతి కష్టంగా.. ఇషాన్ కిషన్ అయితే ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. సంజు కూడా నాలుగు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందర్ 12 బంతులు ఎదుర్కొని మరీ దారుణంగా 9 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ నిలబడతాడు అనుకుంటే.. అతడు కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
టీమిండియా ఇలా ఆట తీరు కొనసాగించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఐర్లాండ్ జట్టు పకడ్బందీగా ఆట తీరు కొనసాగించడం.. మ్యాచ్ కు ముందే ఐర్లాండ్ కెప్టెన్ టకార్.. తమకంటూ గేమ్ ప్లాన్ ఉందని చెప్పడం.. దానిని అమలులో పెట్టడం విశేషం. అందువల్లే టీం ఇండియా దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. టి20 క్రికెట్లో గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం ప్రారంభంలోనే వికటించింది.
సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టడం.. అయ్యర్ కు చోటు ఇవ్వడం.. ఐర్లాండ్ లాంటి అనామక జట్టు మీద ఓడిపోవడం.. వాటి పరిణామాలు సగటు భారతీయ అభిమానిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ ఓటమి ఇక్కడితోనే ఆగిపోతే సరిపోతుంది. ఇకపై కూడా కొనసాగితే గంభీర్ ను ఏ టీమ్ ఇండియా అభిమాని కూడా క్షమించడు. ఎందుకంటే అతడు చేసిన ప్రయోగం ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో దారుణంగా విఫలమైంది.. టి20 క్రికెట్ లో కూడా విఫలమైతే గంభీర్ త్వరలోనే అన్ని సర్దుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
