Homeక్రీడలుఐపీఎల్ లో సంచలనం: చేజింగ్ లో రికార్డ్ బద్దలు

ఐపీఎల్ లో సంచలనం: చేజింగ్ లో రికార్డ్ బద్దలు

raj

ఈల.. గోల.. లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్‌ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు లేకున్నా.. సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్స్‌ మెరుపులు మెరిపించారు. ఫోర్ల వరద.. సిక్సర్ల హోరుతో ప్రత్యర్థి అందుకోలేని స్కోర్‌‌ను చేసిన కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌.. అదే చాలెంజ్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ దీటుగా బదులిచ్చింది. ఛేజింగ్‌లో రికార్డు సృష్టించింది. గత వారం సూపర్ ఓవర్‌దాకా సాగిన మ్యాచ్ ఊపిరిబిగపట్టి చూసేలా చేయగా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ అసలు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని అంతే ట్విస్టులతో ఛేదించి ఔరా అనిపించింది. పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ చేసిన ఓ ఫీల్డింగ్ విన్యాసం చూస్తే జాంటీరోడ్స్ ముత్తాత అని అనుకోక తప్పదు.

షార్జా ఒకప్పుడు క్రికెట్ ప్రేమికుల స్వర్గధామం. అక్కడి స్టేడియం అందరికీ చిరపరిచితం. కానీ అక్కడ మ్యాచ్‌లు జరగక ఏళ్లు దాటింది. ఇప్పుడు కరోనా పుణ్యామాని ఐపీఎల్‌కు ఆతిథ్యం అవకాశం దక్కింది. అంతటి చరిత్ర కలిగిన షార్జా స్టేడియం.. మరో చరిత్రకు నిదర్శనంగా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక రన్ ఛేజింగ్ మ్యాచ్ జరిగింది. ఒకవిధంగా దానికి మ్యాచ్‌ అనడం కన్నా.. హైలైట్స్‌ అనే విధంగా సాగింది. బంతి బంతికీ ఫోర్‌‌ లేదంటే సిక్స్.. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లలోనూ కనిపించిన కసి ఇదంతా.

Also Read : గూగుల్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సుందర్ పిచాయ్!

పంజాబ్-–రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. ఇది భారీ స్కోరే కానీ.. అత్యధిక స్కోర్ కాదు. కానీ ఇంత స్కోరు చేసిన జట్టు ఏదీ ఐపీఎల్‌లో ఓడిపోలేదు. మాయంక్ అగర్వాల్ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా బాదేశాడు. దీంతో ఇక పంజాబ్‌దే జోరు అనుకున్నారు. చిరునవ్వుతో వెళ్తున్నా అని సందేశం ఇచ్చిన పంజాబ్ జట్టు కో ఓనర్ ప్రీతిజింతాకు ఆ చిరునవ్వు మిగిలిస్తారని అందరూ అనుకున్నారు.

సెకండ్‌ బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌ దీటుగా ఆడింది.ఇప్పటివరకూ అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు రాయల్స్ పేరుమీదనే ఉంది. దాంతో ఈ సారి కూడా అద్భుతం ఏమైనా జరుగుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ లేదని.. మొదటి పది ఓవర్లు చూసిన ప్రేక్షకులు అలా ఏం జరగదు అని అనుకున్నారు. ఇన్నింగ్స్ ఛేజింగ్‌కు తగ్గ వేగం ఫస్ట్‌ ఓవర్లలో కనిపించలేదు. చివరి నాలుగు ఓవర్లలో 63 పరుగులు చేయాల్సి రావడంతో ఇక ఆశలు గల్లంతయ్యాయి. అప్పటివరకూ క్రీజ్‌లో ఉన్న తెవాతియా  సాదాసీదాగా అడుతూ వచ్చాడు. ఆ తర్వాత అతనికి పూనకం వచ్చిందా అన్నట్లుగా ఆడాడు. 18 ఓవర్‌‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదేసి.. ఐపీఎల్‌లో ఏదీ అసాధ్యం కాదని నిరూపించాడు. దీంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ గెలిచేసింది. భారీ స్కోరు చేసిన విజయం దక్కనందుకు ప్రీతిజింటాకు చిరునవ్వు మాయమైంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ అద్భుతాలు కూడా చోటు చేసుకున్నాయి. పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరి లైన్ అవతల పడిన బంతిని డైవింగ్ చేసి పట్టుకున్నాడు. తాను కింద పడుతున్నానని తెలిసి లోపలికి విసిరేశాడు. కానీ అలా విసిరేసిన సమయం భూమికి.. పూరన్ ఎంత దగ్గరగా ఉన్నాడో ప్రత్యక్షంగా చూస్తేనే ఆ విన్యాసంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. మొత్తానిగి మరో ఆదివారం ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభవం అందించింది.

Also Read : కోతి వల్ల కోర్టుకెక్కిన నటి.. కోతిని పట్టిస్తే 50 వేల రూపాయలు?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version