Team India Head Coach: రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా తదుపరి కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అతని పేరు ఖరారు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ సెక్రటరీ జై షా అండగా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల వారిద్దరు చర్చలు కూడా జరిపారని.. జాతీయ మీడియా కోడై కోస్తోంది. ఈ తరుణంలోనే గౌతమ్ గంభీర్ నియామకం పట్ల టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోచ్ గా అపాయింట్ చేయాలని కోరాడు.
ఇటీవల కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన జారీ చేయడంతో.. 3000 వరకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసింది.. ఈ దరఖాస్తులలో చాలావరకు ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోడీ పేరుతో కూడా దరఖాస్తులు వచ్చాయని జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొన్నది.. ఇది ఇలా ఉండగానే టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపుగా పూర్తయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ మాత్రం గౌతమ్ గంభీర్ పై అంతగా ఇష్టాన్ని ప్రదర్శించలేదు. అతనికంటే ధోనిని హెడ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐకి ఒక సలహా ఇచ్చాడు. ” మహేంద్ర సింగ్ ధోని అద్భుతమైన ఆటగాడు. వినూత్నమైన ప్రణాళికలు రచిస్తాడు. టీమిండియా కు మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అతడికి ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు. పైగా ధోని అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. అతడి మాటను ఆటగాళ్లు గౌరవిస్తారు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లతో జట్టును ముందుండి నడిపించాడు. అతడి అనుభవాన్ని టీమిండియా ఉపయోగించుకోవాలని” రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నాడు. కాగా మహేంద్ర సింగ్ ధోని 2021 t20 ప్రపంచ కప్ సమయంలో టీం ఇండియాకు మెంటార్ గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.