IPL 2023 Final: ఐపీఎల్ 16 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఇలా అయ్యిందేంటి? ఇప్పుడేంటి పరిస్థితి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురయింది. వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ మ్యాచ్ ను వర్షం కారణంగా వాయిదా చేయాల్సి వచ్చింది.

Written By: BS, Updated On : May 29, 2023 8:33 am

IPL 2023 Final

Follow us on

IPL 2023 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు వరుణుడు ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు. ఆదివారం రాత్రి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గల ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సుమారు ఐదు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మైదానం తడిసి ముద్దయింది. కనీస ఓవర్లు ఆడించేందుకు అవకాశం లేకపోవడంతో సోమవారానికి మ్యాచును వాయిదా వేశారు. పిచ్ రిపోర్టు సమయంలో ప్రారంభమైన వర్షం పడుతూనే ఉండడంతో.. పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ఆడించేందుకు అవకాశం లేదని నిర్ధారణకు వచ్చి వాయిదా వేశారు. పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ రిజర్వు డేకు వాయిదా పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురయింది. వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ మ్యాచ్ ను వర్షం కారణంగా వాయిదా చేయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచును సోమవారం రాత్రికి వాయిదా వేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు టాస్ వేయనుండగా 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిజికల్ టికెట్స్ ను జాగ్రత్తగా ఉంచుకొని సోమవారం మ్యాచ్ కు రావాలని స్టేడియం నిర్వాహకులు ప్రేక్షకులకు సూచించారు. ఆదివారం నాటి టికెట్లు సోమవారం జరిగే మ్యాచ్ కు చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు. అయితే, ముగింపు వేడుకలు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి.

సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం..

వర్షాల బాధ తప్పించుకునేందుకే బీసీసీఐ ఐపీఎల్ ను వేసవి కాలంలో నిర్వహిస్తోంది. కానీ, ఈసారి వర్షా కాలంతో సంబంధం లేకుండా వర్షాలు కురవడంతో పలు మ్యాచ్ లకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కు కూడా అటువంటి అవాంతరమే ఎదురైంది. అయితే, రిజర్వు డే అయినా సోమవారం కూడా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వెదర్ కాస్ట్ పేర్కొంది. ఒకవేళ సోమవారం కూడా వర్షం వల్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే ట్రోఫీని రెండు జట్లు షేర్ చేసుకోనున్నాయి. రిజర్వ్ డే కూడా కనీసం 5 ఓవర్ల ఆటను ఆడించే ప్రయత్నం చేస్తారు. ఇక ఆదివారం మ్యాచ్ రద్దు అవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బిగ్ ఫైనల్ మ్యాచ్ తో సండేను పన్ డే గా మార్చాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ తో పాటు బార్లు, రెస్టారెంట్లుకు కూడా తీరని నష్టం జరిగింది.

కోటి ఆశలతో ఎదురుచూస్తున్న అభిమానులు..

ఆదివారం మ్యాచ్ రద్దయినప్పటికీ సోమవారం మ్యాచ్ జరుగుతుందన్న ఉద్దేశంతో కోటి ఆశలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. పూర్తి ఓవర్లు ఆడించేందుకు అవకాశం లేకపోతే కనీస ఓవరర్లు అయినా ఆడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బీసీసీఐ కూడా ఏమాత్రం అవకాశం దొరికినా మ్యాచ్ ఆడించే ఉద్దేశంతోనే కనిపిస్తోంది. ఆదివారం నాటి మ్యాచ్ కు టికెట్లు తీసుకున్న వారికి సోమవారం కూడా అవకాశం కల్పిస్తుండడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రికి వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందన్న భావనతో చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.