Sanjeev Goenka And Rishabh Pant: ఐపీఎల్ లో పది జట్లు ఉన్నాయి. ఈ యాజమాన్యాలలో 9 గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటాయి. ఒక్క లక్నో యాజమాన్యం తప్ప. లక్నో జట్టుకు యజమానిగా సంజీవ్ గోయంకా వ్యవహరిస్తున్నారు. తన జట్టు ఓడిపోవడాన్ని ఈయన ఏమాత్రం జీర్ణించుకోలేరు. పైగా జట్టు ఓడిపోతే తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
2024 సీజన్లో లక్నో జట్టు హైదరాబాద్ చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. ఆ సమయంలో లక్నో జట్టుకు సారధిగా ఉన్న కేఎల్ రాహుల్ తో సంజీవ్ మైదానంలోనే గొడవపడ్డారు. సంజీవ్ వ్యవహార శైలి తట్టుకోలేక రాహుల్ ఆ సీజన్ నుంచే తప్పుకున్నారు. 2024 సీజన్లో ఢిల్లీ జట్టు నాయకుడిగా ఉన్న రిషబ్ పంత్ ను సంజీవ్ భారీ ధరకు కొనుగోలు చేశారు. 2025 సీజన్ నుంచి రిషబ్ పంత్ లక్నో జట్టుకు నాయకుడిగా కొనసాగుతున్నారు. పంత్ ఆధ్వర్యంలో గత ఏడాది లక్నో జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. దీంతో సంజీవ్ రిషబ్ పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. పైగా గత ఏడాది పంత్ కూడా అంత గొప్పగా ఆడలేదు.. కొన్ని సందర్భాలలో అతడు ఆరవ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. వరుసగా సున్నాలు చుట్టడంతో అతడి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి.
ఇప్పుడు కూడా లక్నో జట్టు ఆటతీరు ఏమాత్రం మారలేదు. గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో లక్నో యాజమాన్యం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలనే నిర్ణయంతో ఐపీఎల్ లోకి దిగింది. అయితే ప్రారంభ మ్యాచ్లోనే లక్నో జట్టు లోపాలు బయటపడ్డాయి. పంత్ దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు. మార్ష్, అబ్దుల్ సమద్ మినహా మిగతా వారంతా ఢిల్లీ బౌలర్లకు లొంగిపోయారు.. వాస్తవానికి సొంత మైదానంలో లక్నో జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. గత ఏడాది ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది.. కానీ ఈసారి తొలి మ్యాచ్ లోనే నిరాశ జనకమైన ప్రదర్శన చేసింది.
ఆటగాళ్లు ఇలా విఫల ప్రదర్శన చేసిన నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ ఆగ్రహానికి గురవుతారని.. కం టు మై క్యాబిన్ అంటూ రిషబ్ పంత్ మీద అరుస్తారని.. ఆటగాళ్లను కూడా వదిలిపెట్టరని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సంజీవ్ జట్టు ఆటగాళ్లు ఆడుతున్న తీరును చూసి తీవ్రమైన అసహనానికి గురైన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
