Kolkata Knight Riders: మరో కప్ కోసం ఇప్పటినుంచే కోల్ కతా ప్లానింగ్.. కీలక ఆటగాడి పై వేటు..!

Kolkata Knight Riders: అయితే గత నాలుగు సీజన్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, 2023 లో కోల్ కతా జట్టు యాజమాన్యం ఆటగాళ్ల వేలంలో సరైన ప్రణాళికల రూపొందించింది. మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

Written By: NARESH, Updated On : May 31, 2024 9:17 pm

Kolkata Knight Riders

Follow us on

Kolkata Knight Riders: ఐపీఎల్ 17వ సీజన్లో కోల్ కతా విజేతగా ఆవిర్భవించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టును మట్టికరిపించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడోసారి విజేతగా ఆవిర్భవించింది.. గత ఐదు సీజన్లను గమనిస్తే కోల్ కతా ఒక్కసారి మాత్రమే సెమిస్ వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి, రన్నరప్ గా నిలిచింది. ఇక మిగిలిన నాలుగు సీజన్లలో లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళింది..
అయితే గత నాలుగు సీజన్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, 2023 లో కోల్ కతా జట్టు యాజమాన్యం ఆటగాళ్ల వేలంలో సరైన ప్రణాళికల రూపొందించింది. మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. రెండుసార్లు కప్ అందించిన గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా జట్టులోకి తెచ్చుకుంది. ఇవన్నీ కూడా 17వ సీజన్లో కోల్ కతా జట్టుకు లాభించాయి. అందువల్లే కోల్ కతా జట్టు సగర్వంగా కప్ అందుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో విజేతగా ఆవిర్భవించినప్పటికీ..కోల్ కతా ప్రయోగాలు చేయడం ఆపివేయడం లేదు. వచ్చే సీజన్ కోసం నిర్వహించే మెగా వేలంలో సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ యాజమాన్యమైనా నిర్దిష్ట సంఖ్యలోనే ఆటగాళ్లను తన వద్ద ఉంచుకోగలదు. ఆ ప్రకారం కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు విదేశీ క్రికెటర్లు లేదా ముగ్గురు ఇండియన్ ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడిని తమ వద్ద ఉంచుకోవచ్చు. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా మరో ప్లేయర్ ను దక్కించుకోవచ్చు.
2022 లో మెగా వేలానికి ముందు  కోల్ కతా స్టార్ ఆటగాళ్లు సునీల్ నరైన్, రసెల్, భారత యువ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ ను రిటైన్ చేసుకుంది. అయితే ఈసారి అలాంటి ఆటగాళ్లను ఎంచుకోవడం కోల్ కతా కు అంత సులభం కాదు. కెప్టెన్ అయ్యర్ ను కచ్చితంగా తమ జట్టుతో ఉంచుకోవాలి. ఇక ప్రస్తుతం వెస్టిండీస్ హిట్టర్ల వయసు 36 సంవత్సరాల కు చేరుకుంది. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే సీజన్ వరకు వారు తమ ఫిట్ నెస్ ను కాపాడుకొని, ఆ స్థాయిలో రాణించగలరా అనేది ఒక అనుమానమే. అయితే సునీల్ నరైన్, రసెల్ గేమ్ చేంజర్లు కావడంతో, వారికి మరో అవకాశం ఇవ్వాలని కోల్ కతా జట్టు యాజమాన్యం భావించినట్టు తెలుస్తోంది.
 ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని వరుణ్ చక్రవర్తి లేదా వెంకటేష్ అయ్యర్ తో భర్తీ చేయాలని భావిస్తోంది.. ఒకవేళ ఆర్టీఎం కు అవకాశం లభిస్తే వారిద్దరిని తీసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. వీరు మాత్రమే కాకుండా మిచెల్ స్టార్క్, రింకూ సింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒకవేళ కోల్ కతా జట్టు శ్రేయస్ అయ్యర్, రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకుంటే.. రింకూ సింగ్ పై వేటు పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.