IPL 2026 new rules: నిబంధనలు అనేవి ఒక క్రమ పద్ధతిని సూచిస్తుంటాయి. అంతేగాని ఆ నిబంధనల పేరుతో అడ్డగోలుగా వ్యవహరించాలని కాదు. కాకపోతే ఐపీఎల్లో ఇలాగే సాగుతోంది. నిబంధనలు కఠినంగా ఉంటాయని.. మ్యాచ్ నిర్వహణ పకడ్బందీగా సాగుతుందని నిన్నటిదాకా ఐపీఎల్ కు పేరు ఉండేది. అయితే ఆ నిబంధనల పేరుతో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్లేయర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. ఆదివారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన చర్చకు దారి తీస్తోంది.
ఈ మ్యాచ్లో కోల్కతా, లక్నో జట్ల స్కోర్ లు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కోల్కతా అద్భుతమైన విజయం సాధించింది. సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా ఉత్కంఠ మధ్య గెలుపును అందుకుంది..
సూపర్ ఓవర్ కంటే ఈ మ్యాచ్లో ఒక అంశం చర్చకు దారి తీసింది.. కోల్కతా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు ఆటగాడు రఘు వంశీ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. అతడిని ఆబ్ స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద అవుట్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.. కోల్కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఐదవ ఓవర్ లో రఘు వంశీ షాట్ కొట్టి, రన్ ప్రయత్నించాడు. అయితే అవతల ఉన్న గ్రీన్ నిరాకరించాడు. దీంతో రఘు వంశీ సగం పిచ్ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళాడు. అతడు పరుగు తీస్తున్నప్పుడు పిచ్ కుడివైపుకు వచ్చాడు. ఆ తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు మరొకవైపు నుంచి పరుగు పెట్టాడు. ఫీల్డ్ అటువైపు నుంచి బంతిని విసిరేశాడు. క్రీజ్ లోకి అతడు డైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి రఘువంశికి తగిలింది. దీనిపై లక్నో అంపైర్ కు అప్పీలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే అతడు ఫీల్డింగ్ కు అడ్డుపడ్డాడని భావిస్తూ థర్డ్ ఎంపైర్ అతడిని ఔట్ అని ప్రకటించాడు. కానీ ఆ వీడియోని మాత్రం పరిశీలిస్తే రఘు ఉద్దేశపూర్వకంగా చేయలేదని అర్థమవుతుంది. అతడు రన్ ఔట్ నుంచి తప్పించుకోవడానికి అలా తన దిశను మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఎంపైర్ గుర్తించలేదు. లక్నో జట్టు ప్లేయర్లు అర్థం చేసుకొని ఉండాల్సిందే. అప్పీల్ వెనక్కి తీసుకుంటే బాగుండేది. కానీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం లక్నో జట్టు ఓటమి పాలైంది. రఘు వంశీ ని అన్యాయంగా అవుట్ చేయడంతో.. ఫలితాన్ని లక్నో జట్టు అనుభవించిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
