India Vs South Africa T20 World Cup Super 8: టీమిండియా టి20 వరల్డ్ కప్ సూపర్ 8 సమరానికి సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే మ్యాచ్ టీమిండియా సెమిస్ బెర్త్ ను నిర్ణయించనుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా విజయాలు సాధించింది. కొన్ని సందర్భాలలో చిన్న జట్ల మీద ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి టీమిండియా విజయాలు సాధించింది.
తొలి రౌండులో టేబుల్ టాపర్ గా నిలిచినప్పటికీ.. టీమిండియా తన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. అమెరికా, నెదర్లాండ్స్ జట్ల నుంచి టీమిండియా తీవ్రమైన ఒత్తిడి ఎదురుకొంది. కేవలం పాకిస్తాన్ చెట్టు మీద మాత్రమే అన్ని విధాలుగా ఆకట్టుకున్నది. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో.. టీమిండియాకు ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకమే. భారత జట్టుకు దక్షిణాఫ్రికా ప్రత్యర్ధి కావడంతో.. ఇప్పుడు అన్ని విభాగాలలో చెలరేగాల్సిన అవసరం ఉంది.
2024 లో టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా జట్టు భావిస్తోంది. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్, మార్క్రమ్, బ్రేవిస్, స్టబ్స్, రికెల్టన్, మిల్లర్ వంటి వారితో బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. యాన్సన్, రబాడ, ఎంగిడి, కేశవ్ మహారాజ్ వంటి బౌలర్లతో బౌలింగ్ భాగం కూడా బలంగా కనిపిస్తోంది.
వీరందరినీ ఎదుర్కోవాలంటే టీమిండియా సమర్థవంతమైన ఆట తీరు కొనసాగించాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన స్థాయి ఇన్నింగ్స్ ఆడాలి. తిలక్ వర్మ జిడ్డు ఆటను వదిలిపెట్టాలి. హార్దిక్ పాండ్యా.. అక్షర్ పటేల్ సత్తా చూపించాలి. బౌలింగ్లో కూడా సరికొత్త లయను అందుకోవాలి. వరుణ్ చక్రవర్తికి తగ్గట్టుగా అక్షర్ బంతితో ఆకట్టుకోవాలి. ఇలా చేస్తేనే దక్షిణాఫ్రికా జట్టును టీమిండియా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.
అహ్మదాబాద్ పిచ్ ను నల్లమట్టితో రూపొందించారు. దీంతో స్పిన్నర్లకు ఈ మైదానం అంతగా అనుకూలించకపోవచ్చు. చక్కటి బౌన్స్ వేసే పేసర్లకు ఈ మైదానం స్వర్గధామం అని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ మైదానంపై ఆటగాళ్లు భారీగా పరుగులు చేయడానికి అవకాశం ఉంది.
తుది జట్లు
భారత్: ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, కులదీప్ యాదవ్/ అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్థిక్ పాండ్యా, శివం దుబే.
దక్షిణాఫ్రికా: మార్క్రం, కేశవ్, రబాడ, ఎంగిడి, డికాక్, రికెల్టన్, బ్రేవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సన్, బాష్.