Homeక్రీడలుIndia vs Australia : ఒంటి చేత్తో తిరుగులేని క్యాచ్..మ్యాక్స్ వెల్ నువ్వు సూపరహే! షేకింగ్...

India vs Australia : ఒంటి చేత్తో తిరుగులేని క్యాచ్..మ్యాక్స్ వెల్ నువ్వు సూపరహే! షేకింగ్ వీడియో

India vs Australia : ఏటికి ఎదురీదడం.. సుడిగాలిని తట్టుకొని నిలబడటం సాధ్యమేనా? దీనికి చాలామంది కాదు అని సమాధానం చెబుతారు. కానీ బుధవారం రాజ్ కోట్ లో భారత్ తో జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ నిజం అని నిరూపించాడు. ఆస్ట్రేలియా లోని సూపర్ ఫాస్ట్ బౌలర్లను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో.. అతడు బంతిని అందుకుని మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇలా మూడు కీలకమైన వికెట్లు తీసి భారత జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మిచల్ స్టార్క్, హజిల్ వుడ్ లాంటి తోపు బౌలర్లకు కూడా వికెట్లు దక్కని మైదానంలో.. అతడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ తీసిన విధానం ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. మ్యాక్స్ వెల్ 20వ ఓవర్ నాలుగవ బంతిని భారీ సిక్సర్ గా మలచిన రోహిత్ శర్మ.. వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే మరుసటి బంతిని కూడా భారీ షాట్ ఆడబోయాడు. అతడు బలంగా కొట్టడంతో బంతి తక్కువ ఎత్తులో చాలా వేగంగా దూసుకు వచ్చింది. అయితే యాదృచ్ఛికంగా తన కుడి చేతిని అడ్డంపెట్టిన మ్యాక్స్ వెల్ ఒడుపుగా పట్టుకున్నాడు. ఈ బంతిని క్యాచ్ పెడతాడని రోహిత్ శర్మ కూడా ఊహించలేదు. క్యాచ్ పట్టిన మాక్స్ వెల్ కూడా నమ్మలేదు. అప్పటికి అతడు కూడా ఒక షాక్ లోనే ఉండిపోయాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశతో మైదానం వెనుతిరిగాడు. అప్పటికి జోరుగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. అనుకోని విధంగా అవుట్ కావడంతో స్టేడియంలో ఉన్న అభిమానులు కూడా నిరాశలో మునిగిపోయారు.

రోహిత్ శర్మ వికెట్ మాత్రమే కాకుండా వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీని కూడా మ్యాక్స్ వెల్ అవుట్ చేసి భారత్ కు షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా హాఫ్ సెంచరీ చేసి జోరు మీద ఉన్న విరాట్ కోహ్లీని ఒక ఊరించే బంతివేసి మాక్స్ వెల్ అవుట్ చేశాడు. భారత శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కాగా, మ్యాక్స్ వెల్ 3 వికెట్లు తీయడంతో అతడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాడు. ముఖ్యంగా అతడు రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన విధానం పై నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ‘వేగంగా దూసుకొస్తున్న బంతిని భలేగా క్యాచ్ పట్టావు. మ్యాక్స్ వెల్ నువ్వు సూపరహే” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ కథనం రాసే సమయానికి 32 ఓవర్లకు మూడు వికెట్ల కోల్పోయి భారత్ 203 పరుగులు చేసింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular