Homeక్రీడలుIndia Vs South Africa Final: రోహిత్ , విరాట్ కోహ్లీ.. ఓ విఫల ప్రయోగం..

India Vs South Africa Final: రోహిత్ , విరాట్ కోహ్లీ.. ఓ విఫల ప్రయోగం..

India Vs South Africa Final: క్రికెట్ లో ఓపెనింగ్ జోడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వారు నిర్మించిన పునాదులపైనే.. మిగతా జట్టు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఈ ఓపెనర్లలో ఏ ఒక్కరు విఫలమైనా అది మిగతా ఆటగాళ్లపై పడుతుంది. అంతిమంగా అది జట్టు స్కోరుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధించినప్పటికీ.. పలువురు ఆటగాళ్లు తమ ప్రతిభను విభిన్నంగా ఆవిష్కరించినప్పటికీ.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన ఒక ప్రయోగం మాత్రం విఫల యత్నంగానే మిగిలిపోయింది.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్ల అవతారం ఎత్తారు. వాస్తవానికి రోహిత్ శర్మ గత కొంతకాలంగా టీమ్ ఇండియాకు ఓపెనర్ గా ఆడుతున్నాడు. అయితే ఈసారి అతనికి జోడిగా విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు. అయితే వీరిద్దరి ద్వయం ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇద్దరూ పేరు మోసిన బ్యాటర్లు అయినప్పటికీ.. టి20 వరల్డ్ కప్ లో తేలిపోయారు. ఐర్లాండ్ జట్టుపై 2.4 ఓవర్లలో 22 పరుగులు, పాకిస్తాన్ పై 1.3 ఓవర్లలో 12 పరుగులు, అమెరికాపై 0.2 బంతుల్లో ఒక పరుగు. ఆఫ్ఘనిస్తాన్ పై 2.5 ఓవర్లలో 11 పరుగులు, బంగ్లాదేశ్ పై 3.4 ఓవర్లలో 39 పరుగులు, ఆస్ట్రేలియాపై 1.4 ఓవర్లలో ఆరు పరుగులు, ఇంగ్లాండ్ పై 2.4 ఓవర్లలో 19 పరుగులు, సౌత్ ఆఫ్రికా పై 1.4 ఓవర్లలో 23 పరుగులను మొదటి వికెట్ భాగస్వామ్యంగా నెలకొల్పారు. అయితే ఏడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ (బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లు మినహా) వరుసగా విఫలం కావడం విశేషం.

అయితే ఓపెనింగ్ భాగస్వామ్యం భారీ పరుగులను నమోదు చేయకపోయినప్పటికీ టీమిండియా వరుస విజయాలు సాధించింది.. వన్ డౌన్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్.. కొందరు బ్యాటర్లు ఆపద్బాంధవుల పాత్ర పోషించి జట్టును విజయ తీరాలవైపు మళ్ళించారు. అమెరికా మైదానాలపై బౌలర్లు, వెస్టిండీస్ మైదానాలపై బ్యాటర్లు + బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియా వరుస విజయాలు సాధించింది. 10 సంవత్సరాల తర్వాత ఫైనల్ వెళ్ళింది.. టీమిండియా ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమయ్యాయి. విరాట్ కోహ్లీని తప్పించాలని కొంతమంది, అతడి స్థానంలో ఈ యశస్వి జైస్వాల్ ను తీసుకోవాలని కొంతమంది, ఓపెనర్లు తక్కువ పరుగులు చేయడం వల్లే టీమిండియా గెలుస్తోందని.. ఇలా విభిన్న రకాలుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. వరుసగా విఫలమౌతూ వచ్చిన అతడు ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు టీమిండియా గౌరవ ప్రదాన్ని మించి స్కోర్ చేసే లాగా తన వంతు పాత్ర పోషించాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆపద్బాంధవుడులా ఆదుకున్నాడు. అక్షర్ పటేల్ తో కలిసి 72, శివం దూబే తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version