Mumbai Indians Captain: 2024 ఐపిఎల్ సీజన్ లో ముంబై జట్టుకు సారధిగా వచ్చాడు హార్దిక్ పాండ్యా. ట్రేడింగ్ విధానంలో ఏ ముహూర్తం లో అయితే అతడు ముంబై జట్టుకు వచ్చాడో .. అప్పటినుంచి అతడి గ్రహచారం ఏమాత్రం బాగోలేదు.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. భార్య నటాషా తో విడిపోయాడు.. ఆ సీజన్ లో ముంబై జట్టు సారధిగా ఆకట్టుకోలేకపోయాడు. ముంబై జట్టు 2024 ఐపిఎల్ లో పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో నిలిచింది.
2025 సీజన్ లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ సీజన్లో మాత్రం దారుణంగా ఆడింది. జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై కి చెప్పుకునే స్థాయిలో విజయాలు రాలేదు. కనీసం ప్లే ఆఫ్ దాకా వెళ్తుందనుకుంటే.. అక్కడిదాకా కూడా వెళ్లలేకపోయింది. ముంబై జట్టు సారధిగా హార్దిక్ పాండ్యా తనదైన మార్క్ చూపించలేదు. కొన్ని సందర్భాలలో అతడిని జట్టుకు దూరంగా ఉంచారు. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా జట్టుకు తాత్కాలిక నాయకత్వం వహించారు. వారిద్దరూ పగ్గాలు అందుకున్నప్పటికీ ముంబై జట్టు రాత ఏమాత్రం మారలేదు.
ఇటీవల ముంబై జట్టు ఆడిన ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన ఒంటి మీద ఉన్న జెర్సీని తొలగించి అభిమానుల సందోహంలో వేశాడు. దానికంటే ముందు ముంబై జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా పరోక్షంగా తాను ముంబై జట్టును వీడి వెళ్లిపోతున్నట్టు సంకేతాలిచ్చాడు. ముంబై యాజమాన్యం కూడా అతడిని పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు అధికారికంగా క్లారిటీ రాకపోయినప్పటికీ అతడు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. అతడి స్థానంలో ముంబై పగ్గాలు అందుకునేందుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తిలక్ వర్మకు రోహిత్ శర్మ సపోర్ట్ ఎక్కువగా ఉంది. సూర్య కుమార్ యాదవ్ తో కూడా అతడికి మెరుగైన సంబంధాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ తో కూడా తిలక్ వర్మకు మెరుగైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని జట్టుకు నాయకుడిగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తిలక్ వర్మ ఒత్తిడిలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడతాడు. పైగా అతడికి హిట్టర్ అనే పేరు ఉంది. కాబట్టి ముంబై మేనేజ్మెంట్ వచ్చే సీజన్లో తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.
