Gujarat Vs Punjab IPL Match: ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్లో ఊహించని విధంగా పంజాబ్ జట్టు చేతిలో పరాజయాన్ని మూట కట్టుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలవాల్సి ఉండేది. ఎందుకంటే పంజాబ్ జట్టు రెండో వికెట్ కోల్పోయిన తర్వాత.. గుజరాత్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ వేశారు. కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్ జట్టు మీద తీవ్రమైన ఒత్తిడి పెంచారు. ఒక మోస్తరు స్కోర్ చేసిన సరే కాపాడుకునే విధంగా కనిపించారు.
కూపర్ 72 పరుగులు చేయడం తో పంజాబ్ జట్టు విజయం సాధించింది. ప్రభ్ సిమ్రాన్ 37 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత.. పంజాబ్ జట్టు తీవ్రమైన ఒత్తిడికి గురైంది. కెప్టెన్ అయ్యర్ 18 పరుగులు చేసి అవుట్ కావడం.. వదెరా, శశాంక్ సింగ్, స్టోయినిస్ వంటి వారు సింగిల్ డిజిట్ కి పరిమితం కావడం.. యాన్సన్ కూడా 9 పరుగులకే అవుట్ కావడంతో.. కూపర్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అతడికి చివర్లో బార్ట్ లెట్(11) సహకరించడంతో పంజాబ్ జట్టు గెలుపు ఖాయమైంది.
కీలక దశలో వికెట్లు తీసిన గుజరాత్ బౌలర్లు.. చివర్లో దానిని కొనసాగించడంలో విఫలమయ్యారు. కూపర్ ను ఔట్ చేయలేకపోవడంతో పంజాబ్ జట్టు చివరి వరకు పోరాటం చేసింది. అయితే అతడు గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి మొత్తం పంజాబ్ జట్టుకు అనుకూలంగా మారిపోయింది. గెలిచే స్థితిలో ఓడిపోయినప్పటికీ గుజరాత్ గొప్పగా చెప్పుకునే సంఘటనలు మ్యాచ్లో చోటుచేసుకున్నాయి.
గుజరాత్ జట్టు ప్రధాన బౌలర్ ప్రసిద్ కృష్ణ 13 ఓవర్లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ 14 ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 15 ఓవర్లు ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మూడు ఓవర్లలో పంజాబ్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఇదే మ్యాజిక్ చివరి వరకు గుజరాత్ బౌలర్లు కొనసాగించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఐపీఎల్ చరిత్రలో ఒక మోస్తరు స్కోరు లక్ష్యాన్ని కాపాడుకున్న ఘనత గుజరాత్ జట్టు పేరు మీద ఉండేది.
