Ambati Rayudu : అంబటి రాయుడు రెడీ

త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అంబటి రాయుడు ప్రకటించారు. కానీ ఏ పార్టీ అని మాత్రం చెప్పలేదు. జగన్ విధానాలను ప్రశంసించడం, పరోక్షంగా చంద్రబాబును వ్యతిరేకించడం చూస్తుంటే ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనబడుతోంది.

Written By: Dharma, Updated On : June 29, 2023 11:50 am
Follow us on

Ambati Rayudu : క్రికెట్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. రాజకీయ అరంగేట్రం చేయనున్నట్టు స్వయంగా ప్రకటించారు. గత కొద్దిరోజులుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రాయుడు చర్యలు ఉండేవి. గుంటూరు జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన రాయుడు కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. అయితే క్రికెటర్ గా ఆశించిన స్థాయిలో రాయుడు రాణించలేకపోయారు. కానీ ఐపీఎల్ లో ఎంట్రీ తరువాత దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఐపీఎల్ తాజా సీజన్ లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దీంతో రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమని టాక్ నడిచింది. ఎట్టకేలకు ఆయనే ప్రకటించారు.

రాయుడు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. గత కొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ విధానాలను ప్రశంసిస్తూ వచ్చారు. ఒకటి రెండుసార్లు స్వయంగా జగన్ ను కలిశారు. ఇటీవల ఐపీఎల్ లో సీఎస్కే గెలుపుతో కప్ తో జగన్ కలిసి అభినందనలు అందుకున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఇక పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. క్రికెటర్ గా యూత్ లో ఫాలోయింగ్ ఉండడం, కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జగన్ సైతం రాయుడు విషయంలో ఆసక్తి చూపినట్టు సమాచారం.

వైసీపీ నుంచి రాయుడు ఎంపీగా పోటీచేయడం ఖాయంగా తెలుస్తోంది. గుంటూరు నుంచి కానీ.. మచిలీపట్నం నుంచి కానీ పోటీచేస్తారని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో గుంటూరు స్థానం వైసీపీకి చిక్కలేదు. ఇక్కడ గల్లా జయదేవ్ ఎంపీగా గెలుపొందారు. అలాగే మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదన్న టాక్ ఉంది. అక్కడ బాలశౌరి మార్పు అనివార్యంగా మారినట్టు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి అంబటి రాయుడ్ని బరిలో దించితే సునాయాసంగా విజయం దక్కుతుందని వైసీపీ హైకమాండ్ అంచనా వేస్తోంది.

త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అంబటి రాయుడు ప్రకటించారు. కానీ ఏ పార్టీ అని మాత్రం చెప్పలేదు. జగన్ విధానాలను ప్రశంసించడం, పరోక్షంగా చంద్రబాబును వ్యతిరేకించడం చూస్తుంటే ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతానికి ప్రజా సమస్యలు అధ్యయనం చేస్తున్నానని.. వాటిపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటానని రాయుడు చెబుతున్నారు. అయితే మంచి ముహూర్తం చేసి వైసీపీలో చేరుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంటే త్వరలో రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారన్న మాట.