Tirumala News : భక్తులకు బిగ్ అలెర్ట్.. తిరుమలలో కీలక ఘట్టం.. నెలరోజుల పాటు మూసివేత!

తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక ఉత్సవాలనేవి ఏడాది పొడవునా కొనసాగుతుంటాయి. వాటిని కనులారా చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది.

Written By: Dharma, Updated On : July 30, 2024 11:11 am
Follow us on

Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 79,327 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అందులో 25,894 మంది తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.భక్తులకు టీటీడీ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండనక్కర్లేదు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది. స్వామి వారి అన్నప్రసాదాలపై కొత్త ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే స్వామివారి దర్శనానికి సంబంధించి నిబంధనలు సడలించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తిరుమలలో కీలక ఘట్టానికి తెర లేవనుంది. దాదాపు నెలరోజుల పాటు శ్రీవారి ఆలయ పుష్కరిణిని మూసివేయనున్నారు. బ్రహ్మోత్సవాల సన్నాహాల్లో భాగంగా పుష్కరిణిలో పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పనులు చేపట్టే వీలుగా నెలరోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు ఒకటి నుంచి 31 వరకు పుష్కరిణి మోతపడనుంది. దీంతో నెలరోజుల పాటు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని రద్దు చేశారు. నెలరోజుల పాటు చురుగ్గా పుష్కరణలో పనులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి టిటిడి సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

* నెల రోజులు పుష్కరిణి మూసివేత
టీటీడీ పుష్కరిణిలో జలాలను మోటార్లతో తోడివేయునున్నారు. పైపులైన్లకు సంబంధించి మరమ్మత్తులు చేయనున్నారు. పెండింగ్ మరమ్మత్తు పనులు కూడా పూర్తి చేస్తారు. మొదటి పది రోజులు నీటిని బయటకు పంపిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు చేపడతారు. చివరి పది రోజులు తిరిగి నీటిని పుష్కరిణిలోకి పంపి నింపుతారు. నీటి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ ఏడు ఉండేలా చేస్తారు. పీహెచ్ 7 అనేది నీరు ఎంత శుద్దంగా ఉంటుందనేది తెలియజేస్తుంది. వీటన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం వాటర్ వర్క్స్ విభాగం పర్యవేక్షిస్తోంది.

* ఆగస్టులో విశేష ఉత్సవాలు ఇవే
ఆగస్టులో టీటీడీలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 4వ తేదీన శ్రీ చక్ర తల్వార్ వర్ష త్రి నక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అన్నంగారాచార్య వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలు జరుగుతాయి. 7న ఆండాళ్ తిరువాదిపురం శాత్తుమొర, శ్రీవారు పురుసై వారి తోటకు వేంచేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 9న గరుడ పంచమి సందర్భంగా తిరుమల సన్నిధిలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. ఆగస్టు 10న కల్కి జయంతి, 13న తరిగొండ వేంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 14న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.

* టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టులో ఇది పెరగనుంది. ముఖ్యంగా విశేష ఉత్సవాల సమయంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందుకే టీటీడీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో విశేష ఉత్సవాలు ఉన్న దృష్ట్యా భక్తులు స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.