Akshaya Tritiya 2026: తెలుగు క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. ఈరోజు ఏవైనా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూల సమయం అని భావిస్తారు. అలాదే దాన ధర్మాలు చేయడానికి ఇదే మంచి సమయం అని అనుకుంటారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర రోజున బంగారం కొంటే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని విశ్వాసం. దీంతో కొందరు చిన్న బంగారు వస్తువైనా కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తుంటారు. దీంతో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ బలపడటం, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు వంటి కారణాలతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా సాధారణ కొనుగోలుదారులు బంగారం కొనేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు. పెట్టుబడిగా బంగారం కొనాలనుకునే వారు కూడా ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు బంగారం కొనుగోలు చేయకపోవచ్చు. అయితే సాంప్రదాయంగా పిసిరంత బంగారం అయినా కొనాలని అనుకునేవారికి ధరలపై ఆసక్తి ఉంటుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,780గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800గా ఉంది. ఇవి గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు కావడంతో వినియోగదారులపై భారం పెరిగింది. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల కోసం బంగారం కొనాల్సిన వారు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.అక్షయ తృతీయ సందర్భంగా చాలామంది చిన్న పరిమాణంలో అయినా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కొందరు పూర్తి ఆభరణాలు కొనడం కష్టంగా ఉండటంతో బంగారు నాణేలు, చిన్న లాకెట్లు వంటి వాటిని ఎంపిక చేస్తున్నారు. అలాగే డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETF వంటి ప్రత్యామ్నాయాల వైపు కూడా కొంతమంది మళ్లుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు దీర్ఘకాలంలో పెరుగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే తక్షణ కాలంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున అవసరానికి అనుగుణంగా, బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. సంప్రదాయం కోసం అయినా, పెట్టుబడి కోసం అయినా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అవసరం.