మందు బాబులకోసం..డాన్ బాబుల హల్ చల్!

కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ ని అమలుపరుస్తున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల మందుబాబుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. చుక్కకి అలవాటుపడ్డ నాలుకని లాక్ డౌన్ లాక్ చేసింది. ఎలాగైనా మందుకొట్టాలనే వారి కోరికను కొంతమంది అమ్మకం దారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ రూరల్ లో బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొందరు బరితెగిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమ షాపునకు వేసిన సీల్‌ తొలగిస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 11:37 am
Follow us on

కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ ని అమలుపరుస్తున్నారు. ఈ లాక్ డౌన్ వల్ల మందుబాబుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. చుక్కకి అలవాటుపడ్డ నాలుకని లాక్ డౌన్ లాక్ చేసింది. ఎలాగైనా మందుకొట్టాలనే వారి కోరికను కొంతమంది అమ్మకం దారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ రూరల్ లో బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొందరు బరితెగిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమ షాపునకు వేసిన సీల్‌ తొలగిస్తున్నారు. తాళాలు తీసి షాపుల్లోని మద్యం నిల్వలను అక్రమంగా మార్కెట్‌ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపేటలో ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఓ వైన్‌ షాపు నిర్వాహకులు, పరకాలలో ఒక వైన్‌ షాపు యజమాని అడ్డంగా దొరికిపోయారు. వీరిపై ఎక్సైజ్‌, పోలీసుశాఖ అధికారులు వివిధ కేసులు నమోదు చేశారు.

లాక్ డౌన్ కారణంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులను మూసివేసి సీలు వేశారు. దీంతో ఆయా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులు మూసి ఉండాల్సిందేనని, తాళాలకు వేసిన సీలు తెరువొద్దని ఎక్సైజ్‌ శాఖ అధికారులు షాపుల యజమానులకు చెప్పారు. దీంతో మార్కెట్‌ లో మద్యం కొరత ఏర్పడింది. బెల్ట్‌షాపుల నిర్వాహకులు అప్పటికే తమ వద్ద ఉన్న మద్యం నిల్వలను ధర పెంచి అమ్మారు. ఎమ్మార్పీపై రెండు నుంచి మూడు రెట్ల వరకు ధర పెరిగింది.
దీంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపుల యజమానులు పలువురు ఇదే అదనుగా భావిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు వేసిన సీల్‌ నిర్భయంగా తొలగించి మద్యం నిల్వలను మార్కెట్‌ కు తరలించి అధిక రేట్లపై అమ్ముతున్నారు.

ఆయా జిల్లాలలో జోరుగా మద్యం అమ్మకాలు

వరంగల్ లోని నర్సంపేటలో ఉన్న మానస బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీలు తొలగించి మద్యం నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా బయటికి తీసి అమ్మారు. సమాచారం అందగానే ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఈ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పై కేసు నమోదు చేశారు. షాపు యజమానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. లాక్‌ డౌన్‌ తర్వాత దీనిపై ఎక్సైజ్‌ శాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం పరకాలలో ఓ వైన్‌ షాపు యజమాని తన షాపునకు వేసిన సీలును తొలగించడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 7న డోర్నకల్‌ లో ఒక వైన్‌ షాపు నుంచి రూ.40వేల పైచిలుకు మద్యాన్ని తరలిస్తుండగా డోర్నకల్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

13న మహబూబాబాద్‌ జిల్లా బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఒక వైన్స్‌ షాపు నుంచి మద్యాన్ని తరలించడాన్ని అధికారులు గమనించి ఆ షాపుపై కేసు నమోదు చేశారు.

ఈనెల 22న అర్ధరాత్రి కు వైరా మండలకేంద్రంలోని ఒక వైన్‌ షాపులో సరుకును మూడు వాహనాల ద్వారా తరలించే క్రమంలో స్థానికులు గమనించి మద్యం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి సీలు తొలగించి మద్యం అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. సీలు తొలగిస్తున్నట్లు భావిస్తున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులకు తమ శాఖ నుంచి రెండో తాళం వేశారు. లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులో మార్చి 21 క్లోజింగ్‌, ఓపెనింగ్‌ బ్యాలెన్సును పరిశీలిస్తామని, తేడా వచ్చిన షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్‌ అధికారి పీ శ్రీనివాసరావు చెప్పారు.