దేశంలో కారోన వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో..వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సోమవారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 430 కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలుపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ట్విటర్ వేదిక అసంతప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయటానికి ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి వస్తే 6 నెలలు జైలుశిక్ష , వెయ్యిరూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇకపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంటువ్యాధి నిరోధక చట్టం అమలుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది.
ప్రజలు తమంతటతాము సురక్షితంగా ఉండటానికి, వ్యాధివ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమలవుతుండగా, మరో 11 రాష్ట్రాల్లో పాక్షికంగా అమలవుతోంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించటంతో ప్రధాని ఉన్నత స్ధాయి అధికారులు,మంత్రులతో సమావేశమై సోమవారం సాయంత్రం మరికొన్ని నిబంధనలు ప్రకటించే అవకాశం ఉంది.