దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దొంగ చాటుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీకి రెట్టింపు రేట్లకు విక్రయాలు జరుపుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లవారు నిబంధనలు ఉల్లంఘించి బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు.
లాక్ డౌన్ సమయంలో నేరుగా మద్యం దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో మందుబాబులు మద్యం కోసం వైన్ షాపులు, బార్లు, బెల్టు షాపుల్లో ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు దొంగచాటు విక్రయాలకు తెరలేపారు. మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. టీచర్స్ ఫుల్ బాటిల్ ధర రూ.1840 కాగా.. దాన్ని రూ.3000కు విక్రయిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్బాటిల్ ఎమ్మార్పీ రూ.1080కాగా.. రూ.3000కు, సిగ్నేచర్ ఎమ్మార్పీ రూ.1060కుగాను రూ.2800కు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఈ దొంగచాటు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, బ్లూ లేబుల్, జానీ వాకర్ వంటి ఫారెన్ లిక్కర్ను మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. వారు ఇప్పటికే సగం స్టాకును అమ్మేశారని, మిగతా రూ. 1,000 కోట్ల విలువైన మద్యాన్ని రెండుమూడు రోజుల్లో అమ్మేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యాపారులు తెలివిగా మద్యం విక్రయాలను పాత తేదీల్లో రికార్డు చేస్తున్నారు. మార్చి 21, అంతకుముందు లిఫ్ట్ చేసిన మద్యం పాత తేదీల్లోనే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఏ షాపునకు ఎంత మద్యం వెళ్లింది, ఏ తేదీన వెళ్లింది అన్నది రికార్డ్ అవుతుంది. అందుకే లాక్డౌన్ తేదీల్లో విక్రయించినట్లు కాకుండా.. ముందే సరుకు మొత్తం అమ్ముడుపోయినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు