YCP – BRS : సర్వేల మాయలో వైసిపి.. బిఆర్ఎస్ ఒక గుణపాఠం

ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు ఆగ్రహంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే పరిగణలోకి తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : December 14, 2023 6:19 pm
Follow us on

YCP – BRS : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. దాదాపు మెజారిటీ సర్వే సంస్థలు మళ్లీ వైసీపీతో గెలుపు అని తేల్చి చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలపై సొంత పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు ఉన్నాయి. వైసిపికి ఏకపక్ష విజయం దక్కుతుంది అన్నది సర్వేల సారాంశం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తీవ్ర ప్రజా వ్యతిరేకత నడుమ ఆ స్థాయిలో ఫలితాలు సాధ్యమా? అని సొంత సొంత పార్టీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నాయకత్వం మాత్రం సర్వేల భ్రమల్లో ఉంది. దీంతో తెలంగాణలో బిఆర్ఎస్ బాటలో ఏపీలో వైసిపి కొనసాగుతుండడంపై రకరకాల చర్చ నడుస్తోంది.

తాజాగా టైమ్స్ నౌ సంస్థ ఏపీలో సర్వే ఫలితాలను వెల్లడించింది. రెండు నెలలు కిందట వైసీపీకి ఇచ్చిన ఏకపక్ష ఫలితాలనే మళ్లీ ప్రకటించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 నుంచి 25 లోక్సభ స్థానాలు వస్తాయని తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం గెలుపొందవచ్చు.. లేకపోవచ్చు అని తెలపడం విశేషం. అయితే సదరు మీడియా సంస్థతో వైసీపీ ప్రభుత్వానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రచార బాధ్యతను సదరు మీడియా సంస్థ చూస్తోందని… అందుకే వైసిపికి సానుకూల ఫలితాలు ఇస్తోందని టిడిపి, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమస్త తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గణాంకాలతో సహా వెల్లడించడం విశేషం.

ప్రస్తుతం ఏపీలో విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం గత ఎన్నికల్లో జగన్ కు ఉన్న అనుకూల వాతావరణం ఏదీ ఇక్కడ కనిపించడం లేదు. కుల సమీకరణలు, చంద్రబాబు అరెస్టు తరువాత మారిన పరిస్థితులు, తెలంగాణ ఎన్నికల ప్రభావం, పవన్, లోకేష్ ల యాత్రలు, వారు ప్రకటించిన మ్యానిఫెస్టోలు… ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీలో కూర్చుని సర్వే నివేదిక వండి వార్చినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి, జనసేన పొత్తులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలపై వాటి ప్రభావాన్ని కూడా సర్వే పట్టించుకోనట్లు లేదు. ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు ఆగ్రహంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే పరిగణలోకి తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.

తెలంగాణలో సైతం బిఆర్ఎస్ సర్వేల మాయలో పడిపోయింది. దాదాపు గత ఐదు సంవత్సరాలుగా వచ్చిన మెజారిటీ సర్వేలు కెసిఆర్ హ్యాట్రిక్ కొడతాయని చెప్పుకొచ్చాయి. ఎన్నికల ముంగిట ఎగ్జిట్ పోల్స్ సైతం కెసిఆర్ కె జై కొట్టాయి. పాపం ఈ సర్వేలను చూసి కెసిఆర్ మురిసిపోయారు. ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న వైఫల్యాలను అధిగమించలేకపోయారు. అయితే ఏపీ విషయంలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏకపక్ష విజయాలు వస్తే.. తాజాగా ఈ అభ్యర్థుల మార్పు ఏమిటని.. అంత ఆందోళన చెందాల్సిన పని ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాయకత్వం తీరు చూసి పార్టీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే సర్వేలు రావడం.. ఒకే తరహా ఫలితాలు చూపిస్తుండడం మాత్రం పార్టీ శ్రేణులు కూడా ఒక రకమైన అయోమయం నెలకొంది. నాయకత్వం గమనించుకుంటే మూల్యం తప్పదనివిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ వ్యూహం ఎలా ఉందో తెలియాలి.