AP Politics : షర్మిల భర్త అనిల్ వల్ల జగన్ SC ఓట్ బ్యాంక్ కి గండి పడుతుందా..!

అదే వ్యూహంతో ముందుకు సాగాలని షర్మిల తో పాటు బ్రదర్ అనిల్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభ పెరిగే అవకాశం ఉంది. వైసీపీకి దెబ్బ తగలనుంది.

Written By: Dharma, Updated On : January 5, 2024 11:52 am
Follow us on

AP Politics – SC Vote Bank : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమె వెంట ఏయే వర్గాలు నడుస్తాయి? అన్న బలమైన చర్చ నడుస్తోంది. ఆమె బలం ఏంటి? బలహీనత ఏంటి? అనే విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. షర్మిలకు ఏపీ ప్రజలు సుపరిచితం. అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నిలబెట్టడంలో ఆమె కీ రోల్ ప్లే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలకు సుపరిచితులయ్యారు. గత ఎన్నికల్లో సైతం అన్నకు అండగా నిలబడి వైసీపీకి ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఈ పరిణామాల క్రమంలో షర్మిల వెనుక బలమైన శక్తి పనిచేసింది. అదే బ్రదర్ అనిల్ కుమార్. షర్మిల భర్త. ప్రముఖ మత ప్రబోధకుడు.

గత ఎన్నికల్లో జగన్ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గెలుపొందారు. దీనికి ప్రధాన కారణం బ్రదర్ అనిల్ కుమార్. క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. ఎస్టీ నియోజకవర్గాల్లో ఉన్న దాదాపు చర్చిలు, ప్రార్థన మందిరాలు ఆయన ఆధీనంలోనే ఉండేవి. గత ఎన్నికలకు ముందు నుంచే పాస్టర్లకు, మత ప్రబోధకులకు ప్రభావితం చేయడంలో బ్రదర్ అనిల్ కుమార్ సక్సెస్ అయ్యారు. పైగా ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం అధికం. ఆ పార్టీ అప్పుడు లేకపోవడంతో క్రిస్టియన్లు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పొందలేక పోయిందంటే దాని వెనుక బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.

ఏపీలో క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎక్కువ. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారు. ఈ లెక్కన దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో క్రిస్టియన్ల ప్రభావం విపరీతంగా ఉంటుంది. అక్కడ ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉండటమే అందుకు కారణం. గత ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో వైసిపి ఏకపక్షంగా విజయం సాధించింది. అక్కడ కూడా బ్రదర్ అనిల్ కుమార్ తెరవెనుక ఉండి చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకు క్రిస్టియన్ మైనారిటీలే. అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా షర్మిలను తన దగ్గరకు చేర్చుకుంది. ఏపీలో ప్రయోగిస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్ గతం మాదిరిగా తెరవెనుక ఉండి చక్రం తిప్పితే క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో వైసీపీకి కూడా దారుణ దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు గా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్ మైనారిటీలు యూటర్న్ తీసుకుంటే 10 నుంచి 20 సీట్లు వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. బహుశా ఈ లెక్క వేసుకునే రాహుల్ గాంధీ ఏపీలో 15% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

క్రిస్టియన్ మైనారిటీల్లో మత ప్రబోధకుల ప్రభావం అధికం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రిస్టియన్ మైనారిటీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. ఎస్సీ సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్ మైనారిటీ వర్గం చీలిపోయింది. రాజకీయంగా సైతం వివిధ పార్టీల ఓటు బ్యాంకుగా మారిపోయింది. అందుకే 2014లో టిడిపి అధికారంలోకి రాగలిగింది. అయితే 67 స్థానాలతో వైసిపి మెరుగైన స్థితిలో ఉండడానికి కారణం కూడా ఎస్సీలు, క్రిస్టియన్ మైనారిటీలే. 2019 నాటికి ప్రజా వ్యతిరేకతకు తోడు.. క్రిస్టియన్, మైనారిటీలు జగన్ కు వెన్నుదన్నుగా నిలవాలని బలమైన నిర్ణయానికి వచ్చారు. అయితే అది ఎన్నికల ముంగిట వచ్చిన ఆలోచన కాదు. 2014లో ఓటమి తర్వాత.. బ్రదర్ అనిల్ కుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. క్రిస్టియన్లను, మైనారిటీలను వైసీపీ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దాని ఫలితమే జగన్ కు అంతులేని విజయం. ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు సాగాలని షర్మిల తో పాటు బ్రదర్ అనిల్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ ప్రభ పెరిగే అవకాశం ఉంది. వైసీపీకి దెబ్బ తగలనుంది.