Gold Reserves : సౌదీ, యూకేను మించి బంగారం నిల్వల్లో భారత్ ముందుకు? ఎందుకంత రిజర్వ్ చేశారు?

పసిడి తయారవుతున్న సౌదీ అరేబియాను మించి.. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న ఇంగ్లాండ్ ను తలదన్ని బంగారాన్ని నిల్వ చేసుకుంటోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 19, 2024 12:05 pm
Follow us on

Gold Reserves : సాధారణంగా బంగారం అనే పేరు ప్రస్తావనకు వస్తే ముందుగా మన మదిలో సౌదీ అరేబియా మిగులుతుంది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ జ్ఞప్తికి వస్తుంది. ఇక నుంచి బంగారం అంటే భారత్ అనే పేరు ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే యూకే, సౌదీని మించి మన వద్ద పసిడి నిలువలు అధికంగా ఉన్నాయి. ఫలితంగా అధిక మొత్తంలో బంగారు నిల్వలు కలిగిన తొలి దేశాలలో భారత్ చోటు దక్కించుకుంది. ప్రపంచ పసిడి సమాఖ్య వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. బంగారం నిల్వలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ వద్ద 3,59,208 కోట్ల (48,157 మిలియన్ డాలర్లు) విలువైన 800.78 టన్నుల బంగారం ఉంది. ఈ ఘనతతో ధనిక దేశాలైన సౌదీ అరేబియా, యూనైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలను భారత్  వెనక్కి నెట్టింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా వద్ద ప్రస్తుతం 4,89, 133 మిలియన్ డాలర్ల విలువైన 3,352 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాలు ఉన్నాయి..   యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా తమ దేశాలలో దాచుకున్న బంగారం నిలువలను పశ్చిమ దేశాలు హోల్డ్ లో పెట్టాయి. వాటిని విడుదల చేయించుకునేందుకు రష్యా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. అయితే అందులో కొంత మేర బంగారాన్ని వివిధ మార్గాల ద్వారా రష్యా విక్రయించి.. వర్తమాన దేశాలకు ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తోంది. ఇక మనకు పొరుగున ఉన్న చైనాలో 2,191.53 టన్నుల బంగారం నిల్వ ఉంది. అయితే ఈ దేశాలు ఎందుకు పసిడిని ఆ స్థాయిలో నిలువ చేస్తున్నాయి అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. దేశ కరెన్సీలో భారీ మార్పులు రాకుండా ఉండేందుకు.. మార్కెట్లో సుస్థిరంగా ఉండేందుకు బంగారాన్ని నిలువ చేస్తాయి. అంతే కాదు తాము పెడుతున్న పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండే విధంగా చూసుకునేలా బంగారాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వాలు నిల్వచేస్తాయి. ఇక ప్రపంచాన్ని నడిపించే అమెరికన్ డాలర్ విలువకు బంగారానికి అమితమైన సంబంధం ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య విలువ విలోమానుపాతంలో ఉంటుంది. అవి రెండు కూడా మార్కెట్ ను శాసిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ డాలర్ విలువ తగ్గితే బంగారం విలువ పెరుగుతుంది. బంగారం విలువ తగ్గితే డాలర్ ధర పెరుగుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ దేశాల బ్యాంకులు తమ వద్ద నిల్వ ఉన్న బంగారాన్ని అత్యంత జాగ్రత్త బహిరంగ విపణి లోకి ప్రవేశపెట్టకుండా కాపాడుకుంటాయి. అనుకోని పరిస్థితులు, ఏవైనా యుద్ధాలు జరిగినప్పుడు అయా దేశాలు బంగారాన్ని వివిధ ప్రపంచ సంస్థల వద్ద తనఖా పెట్టి అప్పు తెచ్చుకుంటాయి. అలా అప్పు తీసుకొచ్చుకొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనదేశంలో ఒకప్పుడు ఆ నిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారాన్ని విక్రయించి డబ్బులు తీసుకొచ్చుకున్నాం. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ మన బంగారాన్ని తెచ్చుకున్నాం. సాధారణంగా బంగారాన్ని పెట్టుబడిగా ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి.

ఇక మన దేశంలో బంగారం వినియోగం అధికంగా ఉంటుంది. చమరు తర్వాత మన దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం అతి ముఖ్యమైనది. మనదేశంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీ కి సమానంగా ప్రభుత్వం బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద భద్రపరుస్తుంది.. అందువల్లే ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. భారత్ కుదురుగా ఉంటుంది అంటే దానికి కారణం అదే. ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశం బంగారాన్ని అత్యంత జాగ్రత్తగా నిల్వ చేసుకుంటోంది. ముఖ్యంగా ఆసియాలో చైనా తర్వాత అంతటి ప్రబల ఆర్థిక శక్తిగా భారత ఎదుగుతోంది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఏవైనా అనర్ధాలు జరిగితే భారత్ లాంటి దేశాన్ని ఆదుకోవడం ప్రపంచానికి తలకు మించిన భారం అవుతుంది. అలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు భారత్ ముందుగానే జాగ్రత్త పడుతోంది. పసిడి తయారవుతున్న సౌదీ అరేబియాను మించి.. అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న ఇంగ్లాండ్ ను తలదన్ని బంగారాన్ని నిల్వ చేసుకుంటోంది.