Himalayas: పైకి అంతా ప్రశాంతం.. లోపలేమో సంఘర్షణ.. హిమాలయాల్లో ఏం జరుగుతోంది?

Himalayas ప్రస్తుత వాతావరణ పరిస్థితులు హిమాలయాల్లో పైకి చల్లగానే కనిపిస్తున్నప్పటికీ.. లోపల భారీ సంఘర్షణకే దారితీస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారత టెక్టోనిక్ ఫలకలో చీలిక వస్తోందని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 18, 2024 1:02 pm

Himalayas

Follow us on

Himalayas: పైకి చూస్తే దట్టంగా పరుచుకున్న మంచు. ఆకాశాన్ని తాకేలా హిమ గిరులు.. వాతావరణం చూస్తే ఎముకలు కొరికి వేసే చలి.. అక్కడక్కడ ఉద్భవించే హిమానీ నదాలు.. అరుదుగా కనిపించే జంతువులు.. మొత్తానికి అక్కడ శీతల వాతావరణం.. ఇలాంటి వాతావరణం పైకి మాత్రమే కనిపిస్తోందా?. అంతర్గతంగా వేరే పరిస్థితి ఉందా? అసలు అక్కడ జరుగుతున్న సంఘర్షణకు కారణం ఏమిటి.. దానివల్ల ప్రపంచం ఎదుర్కొనే ముప్పు ఏమిటి.. దీనిపై భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు హిమాలయాల్లో పైకి చల్లగానే కనిపిస్తున్నప్పటికీ.. లోపల భారీ సంఘర్షణకే దారితీస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే భారత టెక్టోనిక్ ఫలకలో చీలిక వస్తోందని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేషియన్ టెక్టోనిక్ ఫలకతో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వతశ్రేణులు మరింత ఎత్తుకు పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇలా ఎత్తు పెరిగితే ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన జియో ఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్ర నిపుణులు ప్రకటించారు. భారత టెక్టోనిక్ ఫలక సంఘర్షణ ప్రభావాన్ని కూడా వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టెక్టోనిక్ ప్లేట్ ప్రతీ ఏడాది ఐదు సెంటీమీటర్లు ముందుకు కదులుతోంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫలక ముందుకు కదలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టెక్టోనిక్ ప్లేట్ ఐదు సెంటీమీటర్లు ముందుకు కదలడం వల్ల హిమాలయాల పరిధిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనివల్ల హిమాలయ పర్వతశ్రేణిలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.. ఇటీవల భారత దేశంలో విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ లో కదలిక వల్ల హిమాచల్ ప్రదేశ్, నేపాల్ దేశాలలో భూకంపాలు సంభవించాయని గుర్తు చేస్తున్నారు.

ఇక ఇండియాలో ఏర్పడిన టెక్టోనిక్ ప్లేట్ కు కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాతన ఖండమైన గోండ్వానాలో టెక్టోనిక్ ప్లేట్ అనేది ఒక భాగం. ఇది పది కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి విడిపోయి భారత
టెక్టోనిక్ ప్లేట్ ఏర్పడింది. ఈ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది. ప్రస్తుతం భారత ఉపఖండం, దక్షిణ చైనా, పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం వరకు ఇది విస్తరించి ఉంది. అయితే ఇది గత ఐదు కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ ఫలకను ఢీకొంటున్నదని భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా ఢీకొట్టడం వల్లే హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ పలక యూరేషియన్ ఫలకవైపు ఏటా ఐదు సెంటీమీటర్ల మేర కదులుతోంది. దానిని ఢీకొంటోంది కూడా. దీంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరిగి టిబెట్ ప్రాంతాన్ని రెండుగా చీల్చే ప్రమాదం ఉందని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.