Under 19 World Cup : సీనియర్లు, జూనియర్లకు.. ఆస్ట్రేలియా కొరకరాని కొయ్య..

. భారత అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ మూడు టోర్నీల్లో నిర్వేదంగా ఉన్న భారత ఆటగాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ.. తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : February 12, 2024 2:24 pm
Follow us on

Under 19 World Cup : క్రికెట్లో మనకు చిరకాల ప్రత్యర్థిగా పాకిస్తాన్ జట్టును భావిస్తుంటాం. కానీ పాకిస్తాన్ జట్టు మీద జూనియర్ జట్టుకు, సీనియర్ జట్టుకు మంచి రికార్డే ఉంది. వన్డేలు, టెస్ట్ లు, టీ_20 లు..ఇలా ప్రతివిభాగంలోనూ భారత జట్టు పాకిస్తాన్ జట్టుపై మెరుగైన రికార్డే కలిగి ఉంది. ఇక ఇటీవల టోర్నీలు చూస్తే మన జట్టు ట్రోఫీని గెలుచుకునే సమయానికి ఆస్ట్రేలియా జట్టుకు దాసోహం అంటోంది. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆస్ట్రేలియా జట్టు ముందు తలవంచుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీల్లో భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లలో ఓటమిపాలైంది. గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు మనల్ని ఓడించి కప్ లు సొంతం చేసుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021_23, వన్డే ప్రపంచ కప్ 2023, అండర్ 19 ప్రపంచ కప్ మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా జట్టు తిరుగులేని ప్రదర్శన చూపింది. ఈ మూడు టోర్నీ ల్లోనూ భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థిగా లేకుంటే ఈ మూడు టోర్నీల్లో భారత జట్లు విశ్వ విజేతలుగా నిలిచేవి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శించింది. ఆస్ట్రేలియా ఆట తీరు ముందు ఇండియా జట్టు తేలిపోయింది. దీంతో టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. మరోవైపు సంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో అసాధారణమైన ఆట తీరుతో టీమిండియా ఫైనల్ చేరింది. ఓటమి ఎరుగని జట్టుగా రికార్డు సృష్టించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియాలో చిత్తు చేసింది. కానీ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఇండియాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 240 పరుగులు చేసింది.. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. దీంతో 2003, 2023 లో ఫైనల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ కోల్పోయిన రికార్డును ఇండియా తన పేరిట లిఖించుకుంది.

ఆదివారం దక్షిణాఫ్రికా వేదిక గా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లోనూ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అసాధారణ ఆట తీరుతో ఫైనల్ చేరిన భారత జట్టు.. బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేసింది. అయితే ఈ టోర్నీలో ఆస్ట్రేలియాపై భారత్ పై చేయి సాధించినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో కంగారుల ముందు తలవంచింది.. గతంలో 2012, 2018 ఫైనల్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా జట్టును ఇండియా ఓడించింది. దీంతో ఈసారి జరిగే టోర్నీలో ఉదయ్ సహారన్ సేనకు తిరుగు ఉండదని అందరూ అనుకున్నారు. అయితే సీనియర్ టీం లాగానే చెలరేగిన ఆస్ట్రేలియా యువజట్టు భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. సీనియర్ల లాగానే జూనియర్ ఆటగాళ్లు మాటలతో భారత యువ ఆటగాళ్ళను కవ్వించారు. మైండ్ గేమ్ ఆడుతూ భారత బ్యాటర్లను బోల్తా కొట్టించారు. ఈ ఓటమితో మూడు ఐసీసీ టోర్నీల ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినట్టు అయింది. భారత అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ మూడు టోర్నీల్లో నిర్వేదంగా ఉన్న భారత ఆటగాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ.. తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.