Homeజాతీయ వార్తలుKCR : కేసీఆర్ సార్.. ఎంత పనిచేస్తివి..!

KCR : కేసీఆర్ సార్.. ఎంత పనిచేస్తివి..!

KCR : ‘ఎంత మాట.. ఎంత మాట..’ కేసీఆర్ సార్ నాలుక మడతేయడం ఈజీ.. కానీ ఆయన మాట నమ్మి వరి వేయని వాళ్ల సంగతేంది? .. ఇదే ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించలేదు. దీంతో హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ ఆగమేఘాలపై కేబినెట్ మీటింగ్ పెట్టి ‘మంచి కబురు చల్లగా చెప్పాడు..’ యాసంగిలో పండిచిన ధాన్యం కేంద్రం కొనకున్నా.. తాము కొంటామని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలను నమ్మి ఈసారి వరి వేయని రైతులు ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటున్న పరిస్థితి నెలకొంది. కేసీఆర్ మొదట చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేసింది ఒకటి.. ఈ గేమ్ లో పాపం రైతులే సమిధలయ్యారని చర్చ సాగుతోంది. దీనిపై స్పెషల్ ఫోకస్..

ఇన్ని రోజుల యుద్ధానికి.. కేంద్రం స్పందించనందుకు.. కేసీఆర్ పిలుపునకు రైతులంతా వరి వేయకుండా భూములను వదిలేశారు. చాలా మంది ఇతర పంటలు వేశారు. ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు వరిధాన్యం కొంటామని కేసీఆర్ అనడంతో.. ఆయన మాటలను నమ్మి యాసంగిలో వరి వేయని రైతులు ఇప్పుడు నిండా మునిగిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి.. మరో సమస్యను నెత్తి మీద పెట్టుకుంటున్నట్లుగా పరిస్థితి మారింది. యాసంగి వడ్లను ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. సీఎం ప్రకటన చాలా మంది రైతులను షాక్ కు గురిచేసింది. కేసీఆర్ యాసంగి ముందు స్వయంగా వరి వేయవద్దని.. కేంద్రం కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిందని.. ఇక కొనదని చెప్పడంతో ఆయన మాటలను గుడ్డిగా నమ్మి ఈసారి వరి పంట వేయలేదు. కొందరైతే ఏ పంట వేయకుండా భూములు ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు వరి కొంటామని కేసీఆర్ ప్రకటనతో రైతులంతా నిండా మునిగినట్టు అయ్యింది. కేసీఆర్ మాటలు నమ్మి తాము నట్టేట మునిగామని రైతులు వాపోతున్నారు.

ఈ యాసంగి పంట కాలం ముందు కేసీఆర్ వరి విత్తనాలు దొరకకుండా కలెక్టర్లతో నియంత్రించాడు. వరి వేయవద్దని కేసీఆర్ స్వయంగా రైతులకు పిలుపునిచ్చాడు. దీంతో వేలమంది రైతులు అసలు వరిపంటను వేయలేదు. చాలా మంది ఇతర పంటలు వేశారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా కూడా వేల ఎకరాలను బీళ్లుగా వదిలేశారు. ప్రత్యామ్మాయ పంటలు ఏవి వేయాలో? అసలు పండుతాయో తెలియక ఇలా చేశారు. దీంతో ఈ యాసంగిలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.

ప్రభుత్వం మాట వినకుండా వరిపంట వేసిన వారికి ఇప్పుడు కేసీఆర్ ప్రకటన ఊపిరినిచ్చింది. వారి పంటకు గిట్టుబాటు ధర రానుంది. కానీ కేసీఆర్ మాట విని వేయని పరిస్థితియే ఎటూకాకుండా పోయింది. కేసీఆర్ మాట విని వరి వేయని రైతులను ఇప్పుడు ఆయన ఆదుకోవాలన్న డిమాండ్ వారి నుంచే వినిపిస్తోంది.

కేసీఆర్ దీనిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. యాసంగిలో వడ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ నష్టం రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకున్నన్నీ వడ్లు ఇచ్చి మిగతా బియ్యాన్ని ఇక్కడే రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని చూస్తున్నారు. కానీ వరి వేయకుండా నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే వారి నుంచి నిరసన సెగ ఖచ్చితంగా కేసీఆర్ కు తగలడం ఖాయం. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపడుతారన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version