ABN RK : న్యాయం వైపు ‘ఆర్కే’నా? ఎంతమందికి అన్యాయం చేశావో తెలుసా?

న్యాయం గురించి వీర లెవెల్ లో మాట్లాడిన రాధాకృష్ణ.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఎలాంటి రాతలు రాశాడో తెలియదా? 2019 ఎన్నికలకు ముందు రేణు దేశాయ్ తో ఎలాంటి ఇంటర్వ్యూ చేశాడో తెలియదా? ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు చిరంజీవి మీద ఎలాంటి కథనాలు ప్రచురించాడో తెలియదా?

Written By: NARESH, Updated On : July 30, 2023 10:04 am
Follow us on

ABN RK : మీరు కేజీఎఫ్ సినిమా చూశారా? అందులో ప్రశాంత్ నీల్.. హీరో యష్ కు విపరీతమైన ఎలివేషన్లు ఇచ్చాడు. ఒక సంఘటన సృష్టించడం.. దానికి యష్ అలియాస్ రాఖీ భాయ్ ని ఒక సేవియర్ గా మార్చడం.. సినిమా మొత్తం ఇలానే చేశాడు. హీరోఇజం బాగా నచ్చి జనం ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అదంటే సినిమా కాబట్టి పెద్దగా లాజిక్ వెతకాల్సిన అవసరం లేదు. కానీ రియల్ లైఫ్ లో అలా ఉండదు. అదేంటో గాని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తనకు తానుగా కేజీఎఫ్ రాఖీ భాయ్ గా ఊహించుకుంటారు. తాను రాసే కొత్త పలుకులో ప్రతిసారి తనకు తానే ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. జర్నలిజంలో తానే పుడింగిని అయినట్టు బిల్డప్ ఇస్తుంటారు. తాజాగా రాసిన కొత్త పలుకులోనూ తనకు తాను జర్నలిజంలో తోపు అనే స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఇంతకీ వేమూరి రాధాకృష్ణ ఆ స్థాయిలో రాయడం వెనుక అసలు కారణమేంటంటే.. జగన్ ఆస్థాన సంచాలకుడు, మాజీ పాత్రికేయుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడటం, కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును తప్పు పట్టడం, వైయస్ సునీత రెడ్డి కి వేమూరి రాధాకృష్ణ సలహాదారుగా ఉన్నాడని చెప్పటం.. ఇంకేముంది సందు దొరికింది. రాధాకృష్ణ చెలరేగిపోయాడు. కొత్త పలుకులో సర్వ పరిత్యాగి మాటలు మాట్లాడాడు. అంతేకాదు తాను న్యాయం వైపు ఉన్నానని, ఆన్యాయాన్ని అస్సలు సహించని కల్కి అవతారాన్నని చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే నవ్వొచ్చే విషయం ఏంటంటే.. రాధాకృష్ణ తాను ఎంతమందికి అన్యాయం చేశాడో ఒక్కసారి తెలుసుకుంటే మంచిది. కోవిడ్ సమయంలో అడ్డగోలుగా ఉద్యోగులను పక్కనపెట్టి వారి జీవితాలతో ఆడుకున్నాడు. కోవిడ్ తో పిట్టల్లా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రాలిపోతుంటే ఒక్కరికి కూడా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఉద్యోగుల జీతాల నుంచి రిలీఫ్ ఫండ్ పేరుతో ప్రతినెల వసూలు చేస్తున్న సొమ్ములో కొంత కూడా వారికి ఇవ్వలేదు. ఇక వేతనాల పెంపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులకే న్యాయం చేయలేనివాడు.. సమాజానికి న్యాయం చేస్తాను అంటే నమ్మాలా?!

న్యాయం గురించి వీర లెవెల్ లో మాట్లాడిన రాధాకృష్ణ.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఎలాంటి రాతలు రాశాడో తెలియదా? 2019 ఎన్నికలకు ముందు రేణు దేశాయ్ తో ఎలాంటి ఇంటర్వ్యూ చేశాడో తెలియదా? ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు చిరంజీవి మీద ఎలాంటి కథనాలు ప్రచురించాడో తెలియదా? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే రాధాకృష్ణ ఎలాంటి వ్యాఖ్యానాలు చేశాడో తెలియదా? మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కు ఎలాంటి కవరేజ్ ఇచ్చారో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విధితమే.

వైయస్ షర్మిల గతంలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు సింగిల్ కాలం వార్త కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కాలేదు. జగన్ తో ఆమెకు ఎప్పుడైతే విభేదాలు మొదలయ్యాయో అప్పుడే రాధాకృష్ణ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఆమెను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం ద్వారా ఇంటర్వ్యూ చేశారు. తన పత్రికలో ప్రముఖ ప్రాధాన్యమించారు. అంటే ఈ సంకేతాలు ఏ న్యాయం వైపు నిలబడ్డట్టు సూచిస్తున్నాయి? అప్పట్లో కోటి అనే ఒక యువకుడు లక్ష్మీపార్వతి మీద వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి వార్తలు రాశారో రాధాకృష్ణకు తెలుసా? పోనీ మర్చిపోయాడా? వైఎస్ షర్మిలకు ఓ హీరోకు సంబంధం ఉన్నట్టు ఇదే రాధాకృష్ణ రాతలు రాయలేదా? ఇవన్నీ తాను మర్చిపోయి.. రేపటి నాడు సజ్జల రామకృష్ణారెడ్డికీ తామే దిక్కవుతామని రాధాకృష్ణ చెప్పడం నూరు గొడ్లను తిన్న రాబందు శాంతి వచనాలు వల్లించినట్టే అవుతుంది.. ఒళ్లంతా పసుపు రంగు పూసుకొని… నేను న్యాయం వైపు నిలబడుతున్న అని చెప్పడం అది రాధాకృష్ణకి సాధ్యమవుతుంది.