Revanth Reddy : రేవంత్‌ దూకుడు.. వరుసగా నోటిఫికేషన్ల వెనుక కథేంటి?

నియామక పత్రాలు కూడా ఎల్‌బీ స్టేడియంలో అందిస్తూ అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజల్లో పాజిటివ్‌ సంకేతాలు వస్తున్నాయి. ఇలా కేసీఆర్‌ చేయని పని చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.

Written By: NARESH, Updated On : March 1, 2024 9:26 am
Follow us on

Revanth Reddy : తెలంగాణలో పదేళ్లలో యువత ఏది ఆశించారో అది జరుగలేదు. యువతను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు కూడా. రైతులు, వృద్ధులకు రైతుబంధు, ఆసరా ఫింఛన్లు ఇస్తున్నాం.. వాళ్లే గెలిపిస్తారు.. యూత్‌లో అయ్యేది లేదు.. పోయేది లేదు అన్నట్లుగా వ్యవహరించారు గత పాలకులు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. యువత బలోపేతమైంది. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను గుర్తించింది. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని తీరు, ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యాన్ని గ్రహించింది. అయితే అదే సమయంలో యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్‌ హడావుడిగా నోటిపికేషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. పరీక్షలు నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే హడావుడి నిర్ణయాలతో అభాసుపాలయ్యాడు. పేపర్‌ లీకేజీలు, నోటిఫికేషన్లపై కోర్టు కేసులు ఇలా అనేక కారణాలతో ఉద్యోగాల భర్తీ పరీక్షల దశలోనే ఆగిపోయింది.

అందిపుచ్చుకున్న రేవంత్‌..
ఇదే విషయాన్ని నాడు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి అందిపుచ్చుకున్నారు. అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు మేనిఫెస్టోలోనూ చేర్చారు. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీని క్షపక్షాళన చేయడం మొదలుపెట్టారు. కొత్త కమిషన్‌ ఏర్పాటు చేశారు.

వరుసగా ఉద్యోగాలు..
కేసీఆర్‌ ఏదైతే చేయలేకపోయారో.. ఇప్పుడు అదే రేవంత్‌ చేస్తున్నారు. యువత ఏదైతే ఆశించిందో అదే నెరవేరుస్తున్నారు. గత పాలనతో పరీక్షలు పూర్తయి ఫలితాల దశలో ఆగిన స్టాఫ్‌ నర్సు, వివిధ టీఎస్‌పీఎస్సీ ఫలితాలు ప్రకటించి నియామకపత్రాలు అందించారు. కోర్టు కేసులను త్వరగా పరిష్కరించారు. తాజగా గురుకుల ఫలితాలు ప్రకటిస్తున్నారు. ఇక, గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ కొత్తగా ఇచ్చారు. తాజాగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు.

ఖాళీలన్నీ భర్తీ..
వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూస్తోంది. నియామక పత్రాలు కూడా ఎల్‌బీ స్టేడియంలో అందిస్తూ అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజల్లో పాజిటివ్‌ సంకేతాలు వస్తున్నాయి. ఇలా కేసీఆర్‌ చేయని పని చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.