Revanth Reddy : రేవంత్‌ కు పిలుపు.. ఢిల్లీలో హైడ్రామా.. ఇదే కాంగ్రెస్‌ మార్క్ రాజకీయం!

తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఢిల్లీలోని కాంగ్రెస్‌ పద్దలను ఆహ్వానించిన రేవంత్‌.. తిరిగి హైదరాబాద్‌ పయనవయ్యేందుకు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఆయనకు ఏఐసీసీ నుంచి పిలుపు రావడం కలకలం రేపింది.

Written By: NARESH, Updated On : December 6, 2023 8:55 pm
Follow us on

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎంపిక లాంఛనమే అయింది. ఈమేరకు టీపీసీసీ నేతలు గవర్నర్‌కు కూడా లేఖ అందించారు. గురువారం మధ్యాహ్న 1.04 నిమిషాలకు ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి సంతకం చేసే ఫైళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కాంగ్రెస్‌ నేతలను ఉలిక్కిపడేలా చేశాయి. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఢిల్లీలోని కాంగ్రెస్‌ పద్దలను ఆహ్వానించిన రేవంత్‌.. తిరిగి హైదరాబాద్‌ పయనవయ్యేందుకు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఆయనకు ఏఐసీసీ నుంచి పిలుపు రావడం కలకలం రేపింది.

ఎయిర్‌ పోర్టు నుంచి వెనక్కి..
తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద బయల్దేరేందుకు ఢిల్లీలోని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇంతలో ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి రేవంత్‌కు పిలుపు వచ్చింది. వెంటనే హాజరు కావాలని అందులో ఉంది. దీంతో రేవంత్‌రెడ్డి వెంటనే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

కేడర్‌లో గందరగోళం..
ఎయిర్‌పోర్టుకు వచ్చిన రేవంత్‌కు ఏఐసీసీ నుంచి పిలుపు రావడం, అంతకు ముందు డీకే.శివకుమార్‌తో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ కావడంతో అసలు ఏం జరుగుతోంది అన్న సందిగ్ధం కేడర్‌లో నెలకొంది. అసలు ఏఐసీసీ ఎందుకు పిలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. సోషల్‌ మీడియాలో వరుస పోస్టులతో గందరగోళం నెలకొంది. కానీ వెనక్కి పిలవడంతో రహస్యం ఏమీ లేదని తేలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్‌ మార్కు రాజకీయం ఇలాగే ఉంటుంది అని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడడం కనిపించింది.

స్పీకర్‌ పదవిలోనే పీటముడి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ విషయంలో పీటముడి నెలకొందని సమాచారం. శ్రీధర్‌బాబు, సంతోష్‌రెడ్డిలో ఎవరికి స్పీకర్‌ పదవి ఇవ్వాలన్న సందిగ్ధం నెలకొంది. శ్రీధర్‌బాబు స్పీకర్‌ పదవిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌ను ఢిల్లీ ఎయిర్‌ పోర్టు నుంచి వెనక్కు రప్పించారని తెలుస్తోంది.