Ramgopal Varma : మళ్లీ హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ.. ఈసారి ఏం వివాదమంటే..

కేవలం మీడియాలో రెండు కాలాల వార్త రాయడానికి తప్ప.. ఆర్జీవీ ట్వీట్ ఎందుకూ పనికి రావడం లేదు. పోగొట్టుకున్న తన అస్తిత్వం కోసం వర్మ పోరాడుతున్నాడు గానీ.. అది ఎంతో కాలం మనుగడ సాగించకపోవచ్చు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 13, 2024 10:19 pm
Follow us on

Ramgopal Varma : వ్యూహం ఆకట్టుకోలేదు. దాన్ని ఏదో వెబ్ సిరీస్ గా తీస్తా అని చెప్తున్నాడు. అటు జగన్ కూడా పెద్దగా దేకడం లేదు. చేతిలో  సినిమాలు కూడా లేవు. సో మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఖాళీ. తను ఏదో సినిమాలు తీస్తున్నానని చెబుతుంటాడు కానీ.. వాస్తవ పరిస్థితి అలా లేదు. పైగా రాజకీయంగా పెడుతున్న ట్వీట్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. గత ఎన్నికల మాదిరి అతడి సోషల్ మ్యాజిక్ పనిచేయడం లేదు. చివరికి వైసిపి అభిమానులే రామ్ గోపాల్ వర్మను లెక్కచేయడం లేదు. ఇక ఇటీవల అతడు పెడుతున్న ట్వీట్లు నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ మాత్రమే ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే జనసేన కార్యకర్తలు ఊరుకోవడం లేదు. వారి బాధ తట్టుకోలేక లోకేష్ మీద పడుతున్నాడు.
అలా లోకేష్ మీద పెడుతున్న ట్వీట్లతో మొనాటనీ వచ్చింది కావచ్చు.. ఈసారి తన ఫోకస్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పై పెట్టారు. హైదరాబాదులో కుక్కలు బాలుడి పై దాడి చేసి చంపిన ఘటనను ఉద్దేశించి.. మేయర్ ను క్వశ్చన్ చేస్తూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టాడు. ‘హైదరాబాద్ మేయర్ కు కుక్కలు అంటే ఇష్టమని” పేర్కొంటూ.. గతంలో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియోను మరోసారి తెరపైకి తీసుకొచ్చాడు. “హైదరాబాద్ మేయర్ ఇంటికి ఒకేసారి ఐదువేల కుక్కలను వదలాలి” అంటూ వ్యాఖ్యానించాడు. తనతో ఏ ఛానల్ అయినా డిబేట్ పెట్టాలని కోరాడు. ఆ డిబేట్ కు విజయలక్ష్మి రావాలని సవాల్ చేశాడు.
వాస్తవానికి హైదరాబాదులో జరిగింది దారుణమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రాంగోపాల్ వర్మ కేవలం హైదరాబాద్ మేయర్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. మేయర్ కంటే ముందు హైదరాబాద్ నగర పాలకానికి మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. వారిని మాత్రం కించిత్ మాట కూడా అనడం లేదు. పైగా కేవలం మేయర్ ది మాత్రమే తప్పు అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటారు. కానీ వారందరినీ వదిలిపెట్టి కేవలం హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని మాత్రమే వర్మ టార్గెట్ చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో? అది ఏ వార్డు పరిధిలోకి వస్తుందో? తెలియకుండానే రాంగోపాల్ వర్మ హైదరాబాద్ మేయర్ ను విమర్శించడం విశేషం. అన్నట్టు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్లు ఒకింత ఆలోచింపచేసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా నాసిరకంగా మారిపోతున్నాయి. కేవలం మీడియాలో రెండు కాలాల వార్త రాయడానికి తప్ప.. ఆర్జీవీ ట్వీట్ ఎందుకూ పనికి రావడం లేదు. పోగొట్టుకున్న తన అస్తిత్వం కోసం వర్మ పోరాడుతున్నాడు గానీ.. అది ఎంతో కాలం మనుగడ సాగించకపోవచ్చు.